
కడెం, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లలో స్థానిక నేతలు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ, అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లాలో లబ్ధిదారులు ధర్నా చేశారు. కడెం మండలం లింగాపూర్ రోడ్డుపై మంగళవారం సుమారుగా 10 గంటల పాటు బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ డబ్బులు తీసుకుని అనర్హులకు ఇండ్లు ఇచ్చారని ఆరోపించారు.
రీ సర్వే చేసి జాబితా నుంచి అనర్హుల పేర్లు తొలగించి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండో విడతలో ఇండ్లు ఇస్తామని సూచించారు. అయినా వినకుండా లబ్ధిదారులు వానలోనూ ధర్నాను రాత్రి వరకు కొనసాగించారు.
ఎండలో ధర్నాకు దిగిన మహిళల్లో నేదురి పోసవ్వ, ఆకుతోట రాజవ్వ అనే మహిళలు స్పృహ కోల్పోయారు. ఎంపీఓ వెళ్లి ఎంపీడీవో, కలెక్టర్ కు సమాచారం అందించి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పినా వినలేదు. ఎంపిడివో, జిల్లా ఆఫీసర్లు ఇంకా స్పందించలేదు. ఎంపీడీవోకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇందిరమ్మ ఇండ్ల అనర్హుల ఎంపికలో అధికారుల పాత్ర ఉందేమోనని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేశారు.