అంకుశాపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వసతులు కల్పిస్తాం : రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖానం

 అంకుశాపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వసతులు కల్పిస్తాం : రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖానం

ఆసిఫాబాద్, వెలుగు: అంకుశాపూర్​ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్​ అయేషా మస్రత్ ఖానం అన్నారు. శనివారం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేతో కలిసి వైద్య కళాశాలను సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. తర్వాత ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, అధికారులతో సమావేశమయ్యారు. కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, కాంట్రాక్ట్​పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బందిని నియమిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల, హాస్టల్​భవనాల పనులు పూర్తి కావొస్తున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి, డయాలసిస్ సెంటర్, ఐసీయూ గదులను పరిశీలించారు.  

పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలి 

నస్పూర్, వెలుగు: పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖానం సూచించారు. శనివారం కలెక్టరేట్ లో కలెక్టర్ కుమార్ దీపక్, డీఎంహెచ్​వో  హరీశ్​రాజ్, ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షకుడు హరిశ్చంద్రారెడ్డి, ప్రభుత్వ మెడికల్​కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సులేమాన్, టీజీఎం ఐడీసీ ఈఈ నరసింహారావుతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కలెక్టర్ పరిధిలో ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మాతా-శిశు సంరక్షణ కేంద్రం, మెడికల్​ కాలేజీని సందర్శించారు.