కాంగ్రెస్​ టికెట్​ కోసం ఒక్కరోజే..  200కుపైగా దరఖాస్తులు

కాంగ్రెస్​ టికెట్​ కోసం ఒక్కరోజే..  200కుపైగా దరఖాస్తులు
  • శ్రావణ సప్తమి కావడంతో పోటెత్తిన ఆశావహులు
  • కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొంగులేటి, కొండా సురేఖ, స్రవంతి దరఖాస్తు
  • నేడు రేవంత్​, ఉత్తమ్​, పద్మావతి అప్లై చేసే చాన్స్​

హైదరాబాద్​, వెలుగు: గాంధీభవన్​కు అసెంబ్లీ టికెట్​ ఆశావహులు పోటెత్తారు. బుధవారం శ్రావణ సప్తమి కావడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుచరులు, కార్యకర్తలతో కలిసి వందలాదిగా పార్టీ ఆఫీసుకు వచ్చారు. దీంతో అక్కడి పరిసరాలు కిటకిటలాడాయి. చాలా మంది నేతలు, కార్యకర్తలు తమ కార్లను రోడ్లపైనే పార్క్​ చేయాల్సి వచ్చింది. దీంతో ట్రాఫిక్​ జామ్​ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.  

అప్లికేషన్లు బుధవారం నాటికి 500 దాటాయని గాంధీభవన్​ వర్గాలు చెప్పాయి. బుధవారం ఒక్కరోజే 200 మందికిపైగా అప్లికేషన్లు సమర్పించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, కొండా సురేఖ, సునీతా రావు, పాల్వాయి స్రవంతి, విష్ణువర్ధన్​ రెడ్డి తదితరులు ఎమ్మెల్యే టికెట్​ కోసం అప్లయ్​ చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్​లో లేరు. ఆయన తరఫున నల్గొండ టౌన్​ ప్రెసిడెంట్​ గుమ్మల మోహన్​రెడ్డి, కార్యకర్తలు అప్లికేషన్​ను గాంధీభవన్​లో సబ్​మిట్​ చేశారు. కొత్తగూడెం టికెట్​ కోసం పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మునుగోడు టికెట్​ కోసం పాల్వాయి స్రవంతి, జూబ్లీహిల్స్​ టికెట్​ కోసం విష్ణువర్ధన్​రెడ్డి, ఖైరతాబాద్​ టికెట్​ కోసం సునీతారావు దరఖాస్తు చేసుకున్నారు.

 కొండా సురేఖ వరంగల్​ ఈస్ట్​ నుంచి దరఖాస్తు సమర్పించారు. వాస్తవానికి రేవంత్​ రెడ్డి, ఉత్తమ్​ కుమార్​రెడ్డి,  పద్మావతి కూడా బుధవారమే దరఖాస్తు సమర్పిస్తారని ముందు వార్తలు వచ్చినా.. వివిధ కారణాలతో వాయిదా పడినట్టు తెలిసింది. వాళ్లంతా గురువారం అప్లికేషన్లను సమర్పించే అవకాశమున్నట్టు తెలిసింది. కాగా, ఈసారి ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్​లోని సభ్యులకూ కచ్చితంగా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందేనని మహిళా కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు డిమాండ్​చేస్తున్నారు. మొత్తం సీట్లలో 33 శాతం కోటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఖానాపూర్​ నియోజకవర్గం నుంచి చారులత రాథోడ్​ గురువారం అప్లికేషన్​ను సమర్పించనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి  బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే  రేఖానాయక్​ ఇప్పటికే  కాంగ్రెస్​ టికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు.