పారదర్శకంగా పోడు దరఖాస్తుల పరిశీలన
సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో ఆర్ఓఎఫ్ఆర్ కింద వచ్చిన దరఖాస్తుల స్క్రూటినీ పారదర్శకంగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్హాల్లో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డితో కలిసి పోడు దరఖాస్తుల వెరిఫికేషన్, సబ్ డివిజన్ స్థాయి కమిటీ స్క్రూటినీ, సమావేశాలు, ఆన్లైన్ అప్లోడ్ పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోడు దరఖాస్తులకు సంబంధించి సబ్ డివిజన్ స్థాయి కమిటీ సమావేశాలు పూర్తి చేసి జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీకి పంపాలని రెవిన్యూ డివిజనల్ అధికారులకు సూచించారు. సబ్ డివిజన్ స్థాయి కమిటీలు పాటించాల్సిన నిబంధనలు, పరిశీలించాల్సిన అంశాలు, ఆర్ఓఎఫ్ ఆర్ క్లెయిమ్స్ ఏ విధంగా చేయాలన్న దానిపై సూచనలు చేశారు. డిలే కాకుండా అటవీ, పంచాయితీ, రెవెన్యూ, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమీక్షలో జడ్పీ డిప్యూటీ సీఈవో, డీఎఫ్ఓ శ్రీధర్ రావు, డీపీవో సురేశ్మోహన్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, మండల ప్రత్యేక అధికారులు, డీఎల్పీవోలు, జహీరాబాద్, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనల్ అధికారులు, అటవీశాఖ అధికారులు
పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రజలకు సూచించారు. బుధవారం తొగుట మండలం రాంపూర్ ఫంక్షన్ హాల్లో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్తో కలిసి ఆయన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల, మతాలకతీతంగా పేదల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నాయని తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం కేసీఆర్ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇటీవల జమ్ముకశ్మీర్ బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించి అభివృద్ధిని చూసి అభినందించారని తెలిపారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూగత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేదని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజారంజకంగా మారుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బీజేపీ నేతలకు చెంపపెట్టులా మారిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో జరగాలని, దేశానికి కేసీఆర్లాంటి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సిరినేని గోవర్ధన్రెడ్డి, కంకణాల నర్సింలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నాణ్యమైన కరెంట్కు రూ.38 వేల కోట్ల ఖర్చు
టీఎస్ఈఆర్సీ చైర్మన్ టి.రంగారావు
సిద్దిపేట, వెలుగు : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ రంగంతోపాటు గృహ, వాణిజ్య అవసరాల కోసం నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు రూ.38 వేల కోట్లు ఖర్చు చేసిందని రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ తన్నీరు రంగారావు తెలిపారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా విద్యుత్ వినియోగదారుల ముఖాముఖి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఈ రైతుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థకు చెల్లిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లను నింపడానికి 3500 మెగా వాట్ల విద్యుత్ ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తోందని చెప్పారు. వినియోగదారులు విద్యుత్ సంస్థల నుంచి నాణ్యమైన సేవలను పొందేందుకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ యాక్ట్ పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ నియంత్రణ మండలి మెంబర్స్ బండారు కృష్ణయ్య, మనోహర రాజు, ఎస్ఈ ప్రభాకర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
కేజీబీవీ టీచర్లను క్రమబద్ధీకరించాలి
కోహెడ/కొండాపూర్, వెలుగు : కేజీబీవీ టీచర్లను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని టీపీటీఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మహమూద్డిమాండ్చేశారు. బుధవారం కోహెడ మండల పరిధిలోని తంగళ్లపల్లి కేజీబీవీ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కేజీబీవీలోని టీచర్లకు రెగ్యులర్ పే స్కేళ్లను వర్తింపజేయాలని, రాత్రి సమయంలో విధుల నుంచి తప్పించి వార్డెన్లను నియమించాలన్నారు. కొండాపూర్ కేజీబీవీ పాఠశాలలో నిరసన టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లక్ష్మయ్య నిరసన తెలిపి మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేయాలని, హెల్త్ కార్డ్స్ జారీ చేయాలని, ప్రభుత్వ టీచర్లతో సమానంగా సెలవులు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్
మెదక్ (కౌడిపల్లి), వెలుగు: కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ జూనియర్ పంచాయతీ సెక్రటరీ శోభారాణి సస్సెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా విధులకు డుమ్మా కొట్టడం, ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడంలేదని ఆమెపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నర్సాపూర్ డివిజనల్ పంచాయతీ అధికారి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపగా శోభారాణిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ఉత్తర్వులు జారీ చేశారు.
అందరికీ ఉపాధి కల్పించేందుకు కృషి
జహీరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తోందని జహీరాబాద్ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. బుధవారం కోహీర్ మండలం గొడిగర్పల్లి పెద్ద చెరువులో 1.80 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుసుజ, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బంటు రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, నాయకులు సుభాష్రెడ్డి, రామకృష్ణారెడ్డి, వాసునాయక్ తదితరులు పాల్గొన్నారు.