- వెహికల్స్ ధ్వంసం చేసిన టీఎంసీ సపోర్టర్స్
కోల్కతా : బెంగాల్లోని సందేశ్ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై టీఎంసీ నేత షేక్ షాజహాన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ఈడీ అధికారులకు గాయాలయ్యాయి. రేషన్ స్కామ్ కేసులో ఇటీవల మంత్రి జ్యోతిప్రియ మలిక్ అరెస్టయ్యారు. దాంతో కేసుతో సంబంధమున్నట్లు భావిస్తోన్న 18 చోట్ల ఈడీ ఆఫీసర్స్ శుక్రవారం రెయిడ్స్ చేపట్టారు. సీఆర్పీఎఫ్ బలగాలతో షాజహాన్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ దాడి చేశారు.
దాదాపు 800 మంది టీఎంసీ మద్దతుదారులు ఆయుధాలతో దాడి చేయడంతో ఈడీ అధికారులు, కేంద్ర బలగాల వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు ఈడీ అధికారులతో పాటు కొందరు విలేకరులకు కూడా గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ దాడులను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన రుజువు చేస్తోందని పేర్కొంది. దాడుల్లో రోహింగ్యాలు ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.