యాదగిరిగుట్ట, వెలుగు : అకాల వర్షాలకు ధాన్యం తడిసినా రైతులు ఆందోళన పడొద్దని, మద్దతు ధరతో ప్రభుత్వం అన్ని వడ్లను కొనుగోలు చేస్తుందని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. తుర్కపల్లి మండలం దత్తాయపల్లి సహా పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వర్షానికి తడిసిన వడ్లను గురువారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని, రైతులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వడ్లు తడిసిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
మునుముందు కూడా అకాల వర్షాలతో తడిసిన వడ్లను కూడా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని భరోసా ఇచ్చారు. కాగా ఈ నెల 27న ఒక్కరోజే జిల్లాలో 411 మెట్రిక్ టన్నుల తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించామని వెల్లడించారు.
