సింగరేణిలో ఢీ కోల్డ్ మైన్స్ అంటే ఏంటి?..డిపాజిట్ ఫండ్ తిరిగి పొందాలంటే.?

సింగరేణిలో ఢీ కోల్డ్ మైన్స్ అంటే ఏంటి?..డిపాజిట్ ఫండ్ తిరిగి పొందాలంటే.?

లక్ష్యం మేరకు బొగ్గును తవ్విన తర్వాత మూసి వేయాల్సినవాటిని  డీ కోల్డ్ ​మైన్స్ అంటారు.   మైన్లను ప్రారంభిం చినప్పుడు అక్కడ ఎలాంటి పర్యావరణం ఉందో, మూసివేత తర్వాత కూడా తిరిగి అదేవిధంగా  పెంపొందించాల్సి ఉంటుంది. గనుల్లో బొగ్గును వెలికితీసిన తర్వాత కాలయాపన చేయకుండా డీ కోల్డ్​మైన్​గా డిక్లేర్​చేసి పర్యావరణ చర్యలు చేపట్టాలి. ఇందుకు  కోల్​ఇండియా, సింగరేణి సంస్థలకు ఆదేశాలను కేంద్రం జారీ చేసింది. మూసివేసిన గనుల పరిధిలో చెట్లను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. 

డిపాజిట్ ఫండ్ తిరిగి పొందాలంటే..


అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్​కాస్ట్​ప్రాజెక్ట్​లను ప్రారంభించాలంటే భారీగా భూమి కావాల్సి ఉంటుంది.  ముఖ్యంగా అటవీ విస్తరించిన ప్రాంతాల్లోనే బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వేలల్లో చెట్లను నరికిన తర్వాత భూమిని చదును చేస్తారు. అనంతరం కొన్నేండ్లపాటు అక్కడ బొగ్గును వెలికితీస్తారు. లక్ష్యం మేరకు బొగ్గు తీయడం పూర్తయిన తర్వాత తిరిగి ఆ ప్రాంతాన్ని యధాతథ స్థితికి తీసుకురావాలి.

 ఇలా చేస్తామనే హామీతోనే ముందుగా బొగ్గు కంపెనీలు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వద్ద  రూ. వందల కోట్లను డిపాజిట్​గా పెడతాయి. డీ కోల్డ్​ మైన్స్ పూర్వ స్థితికి తీసుకొచ్చి పర్యావరణం పెంపొందించిన తర్వాతే  కేంద్రం రూల్స్ మేరకు డిపాజిట్​సొమ్ము వాపస్​వస్తుంది. దీని కోసమైనా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడతాయి. ఇదే ప్రక్రియ సింగరేణిలో ఉంది. అయితే కోల్​ ఇండియా పరిధిలోని గనుల్లో బొగ్గు నిల్వలు అయిపోయాక మూసి వేయడం లేదు. 

దీంతో వాటిలో ప్రైవేటు వ్యక్తులు ఇల్లీగల్​మైనింగ్​పనులు చేయిస్తుండగా.. చాలా మంది కార్మికులు ప్రమాదాలకు గురై మరణించిన ఘటనలు జరిగాయి. ఇలాంటివి మళ్లీ జరగకుండా బొగ్గు నిల్వలు పూర్తయిన వెంటనే గనుల మూసివేతకు, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలనే కఠిన నిబంధన లను కేంద్రం తెచ్చింది. ఇందులో భాగంగానే బొగ్గు నిల్వలు పూర్తయిన డీ కోల్డ్స్​మైన్స్​ను తప్పనిసరిగా మూసివేయాలని, ఇందుకు కోల్​ఇండియా, సింగరేణి సంస్థలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.