- టెస్ట్లకు గుడ్బై చెప్పే యోచనలో ఆల్రౌండర్
- విజయ్ హజారే టోర్నీకి డుమ్మా
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. కెరీర్పై గందరగోళం మొదలైంది. ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలో ఆల్రౌండర్గా దుమ్మురేపిన ఈ బరోడా బాంబర్.. ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్కు గుడ్బై చెప్పాలని భావిస్తున్నాడు. బ్యాక్ ఇంజ్యూరీ కారణంగా బౌలింగ్ చేయలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు వైట్బాల్ క్రికెట్తో పాటు ఐపీఎల్పై ఎక్కువగా దృష్టిసారించాలని ఆల్రౌండర్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐ పెద్దలకు కూడా చేరవేసినట్లు తెలుస్తున్నా.. అటు బోర్డుగానీ, ఇటు క్రికెటర్గానీ అఫీషియల్గా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 2018లో ఇంగ్లండ్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడిన పాండ్యా అప్పట్నించి ఈ ఫార్మాట్కు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు సౌతాఫ్రికా టూర్కు కూడా అతన్ని పరిగణనలోకి తీసుకునే చాన్స్ లేదు. ‘పాండ్యా చాలా రోజుల నుంచి ఇంజ్యూరీలతో బాధపడుతున్నాడు. టెస్ట్ రిటైర్మెంట్ గురించి మాకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దానివల్ల వైట్బాల్ క్రికెట్పై ఫోకస్ చేసే చాన్స్ పెరుగుతుందని భావిస్తున్నాడు. మా టెస్ట్ టీమ్ ప్లాన్స్లో కూడా అతనికి చాన్స్ కష్టమే. అతను లేకపోవడం లోటే అయినా బ్యాకప్ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నాడు.
బౌలింగ్ లేకపోవడమే..
వాస్తవానికి టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్కు చాలా డిమాండ్ ఉంది. దానిని పాండ్యా చాలా వరకు భర్తీ చేశాడు. కానీ ఎప్పుడైతే బ్యాక్ ఇంజ్యూరీకి సర్జరీ చేయించుకున్నాడో పాండ్యా బౌలింగ్ గాడి తప్పింది. రిథమ్ను పట్టుకోలేక నిలకడగా బౌలింగ్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఐపీఎల్–20, 21లో అతను బౌలింగ్ చేయలేదు. ఇంగ్లండ్తో జరిగిన హోమ్ సిరీస్లో అతను బౌలింగ్కు వచ్చినా మునుపటి స్థాయిలో సత్తా చాటలేకపోయాడు. శ్రీలంక టూర్లోనూ ఇబ్బందులుపడ్డాడు. టీ20 వరల్డ్కప్లో అతని బౌలింగ్ లేకపోవడం ఇండియాను బాగా దెబ్బకొట్టింది. గత 12 నెలల్లో వన్డేలు, టీ20ల్లో కలిపి పాండ్యా 46 ఓవర్స్ మాత్రమే బౌలింగ్ చేశాడు.
రిహాబిలిటేషన్లో..
ప్రస్తుతం ఖాళీగా ఉన్న పాండ్యా.. చివరి ప్రయత్నంగా తన బౌలింగ్ ఫిట్నెస్ను పెంచుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టాడు. నేటి నుంచి స్టార్ట్ అయ్యే విజయ్ హజారే వన్డే టోర్నీని కాదని అతను ముంబైలోనే రిహాబిలిటేషన్ స్టార్ట్ చేశా డు. బరువులు ఎత్తుతూ.. తన బ్యాక్ను పటిష్టం చేసుకునే పనిలో పడ్డాడు. ఈ మేరకు బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ)కు ఓ మెయిల్ కూడా పెట్టాడు. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుందనే దానిపై క్లారిటీ లేదు. దీనికితోడు టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ తెచ్చిన కొత్త రూల్ కూడా ఇప్పుడు పాండ్యాకు ఇబ్బందిగా మారింది. నేషనల్ టీమ్ డ్యూటీ లేకపోతే కాంట్రాక్ట్ ప్లేయర్లు కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని కోచ్ ప్రతిపాదించాడు. ఈ నేపథ్యంలో పాండ్యా చాలా రోజులు రిహాబిలిటేషన్కు వెళ్లే చాన్స్ లేదు. ఎందుకంటే 15 రోజుల్లోగా డొమెస్టిక్ క్రికెట్లోకి రాకపోతే నేషనల్ టీమ్ సెలెక్షన్స్కు పరిగణనలోకి తీసుకోబోమని బరోడా అసోసియేషన్ కూడా పాండ్యాకు అల్టిమేటమ్ ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో క్రికెట్ కెరీర్ను కొనసాగించాలంటే టెస్ట్లకు గుడ్ బై చెప్పక తప్పేలా లేదని పాండ్యా భావిస్తున్నాడు.