
- ఇండియన్ హెచ్1బీ వీసా హోల్డర్లపై సైబర్ దాడి
- భారీ సంఖ్యలో విమాన టికెట్లు బుక్ చేసి, రద్దు చేశారు
- దీంతో అమెరికా వెళ్లేందుకు ఇండియన్లకు తీవ్ర ఇబ్బంది
వాషింగ్టన్: హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఇండియన్ టెకీలు సత్వరం అమెరికాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఇదే అదనుగా అక్కడి అతి జాతీయవాద, జాత్యహంకార గ్రూపులు ‘క్లాగ్ ది టాయిలెట్’ క్యాంపెయిన్ ప్రారంభించాయి. ఇది ఫ్లైట్ బుకింగ్ సిస్టమ్లను బ్లాక్ చేసి, ఇండియన్లను రాకుండా అడ్డుకునే ప్లాన్. టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫోరమ్లలో కొంతమంది వ్యక్తులు ఈ క్యాంపెయిన్ నడిపించారు.
‘క్లాగ్ ది టాయిలెట్’ అంటే సాధారణంగా టాయిలెట్ను బ్లాక్ చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఫ్లైట్ సీట్లను టెంపరరీగా హోల్డ్ చేసి, ట్రావెలర్లను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో చేసిన చర్య. ఫలితంగా విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
ఈ క్యాంపెయిన్లో భాగంగా ట్రోలర్స్ ఇండియా–అమెరికా ప్రసిద్ధ ఫ్లైట్లను టార్గెట్ చేశారు. వారు బుకింగ్ ప్రాసెస్ మొదలుపెట్టి, చెల్లింపు చేయకుండా వదిలేశారు. ఇలా సీట్లు కొంత సమయం పాటు హోల్డ్ అయ్యాయి. ఇండియన్లు ఎక్కువగా వెళ్లే న్యూయార్క్, డల్లాస్, న్యూజెర్సీ, సిలికాన్ సిటీ, టెక్సస్ రాష్ట్రాలకు వెళ్లే విమానాలను లక్ష్యంగా ఈ దాడి చేశారు.
‘ఇండియన్లను ఇండియాలోనే ఉంచాలి’ అంటూ పోస్టులు పెడుతూ ట్రోలింగ్కు పాల్పడ్డారు. ‘టోటల్ జీట్ డెత్’, ‘కిల్ ఎవ్రీ జీట్’ వంటి హేట్ పోస్టులు పెట్టారు. ఏషియన్లు, ముఖ్యంగా ఇండియన్లను అమెరికాలోని కొంతమంది జాత్యహంకారవాదులు ‘జీట్’ అంటూ అవమానకరంగా సంబోధిస్తుంటారు.
ఈ క్యాంపెయిన్ వల్ల చాలా వెబ్సైట్లు క్రాష్ అయ్యాయి, ఎయిర్పోర్టుల్లో చెక్ ఔట్ టైమ్ అవుట్ అయింది. దీంతో ఇండియన్ టెకీలు, నిపుణులు ఇబ్బంది పడ్డారు. ఇటీవల అమెరికా నుంచి ఇండియా వచ్చిన అమృతా తమనం అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 వేల డాలర్లు చెల్లించి టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది సాధారణ సమయాల్లో ఆమె అమెరికా నుంచి ఇండియాకు వచ్చి పోయేందుకు అయ్యే టికెట్ల ఖర్చు కంటే రెండు రెట్లు ఎక్కువ.