- విన్నర్గా ఎవర్ని ప్రకటిస్తారు..
- ప్లేయింగ్ కండీషన్స్ కోసం టీమిండియా వెయిటింగ్
- యూకేలో సాఫ్ట్ క్వారంటైన్ కోసం బీసీసీఐ ప్రయత్నాలు
వరల్డ్ టెస్ట్చాంపియన్షిప్ ఫైనల్తోపాటు ఇంగ్లండ్ టూర్ను సక్సెస్ చేయడంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది..! మూడు చార్టెడ్ ఫ్లైట్స్లో మెన్స్, విమెన్స్ క్రికెటర్లను ముంబై చేర్చిన బోర్డు.. హోటల్ క్వారంటైన్తో మొదటి అడుగు వేసింది..! ఇక సౌతాంప్టన్లో సాఫ్ట్ క్వారంటైన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఇండియన్ బోర్డు.. ఐసీసీ ఇచ్చే మ్యాచ్ ప్లేయింగ్ కండీషన్స్ కోసం ఎదురుచూస్తున్నది..! ఓవరాల్గా మరో రెండు, మూడు రోజుల్లో టూర్, క్వారంటైన్ రూల్స్, ప్లేయింగ్ కండీషన్స్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..!!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్.. డ్రా లేదా టై అయితే పరిస్థితి ఏంటీ..? ఒక వేళ మ్యాచ్ వర్షార్పణం అయితే ఏం చేయాలి..? విన్నర్గా ఎవర్ని ప్రకటిస్తారు..? ఇలా అనేక అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. మెగా ఫైనల్ ప్లేయింగ్ కండీషన్స్ కోసం టీమిండియా ఎదురుచూస్తున్నది. బైలేటరల్ సిరీస్ కాకపోవడంతో.. ఐసీసీ ఎలాంటి రూల్స్ పెడుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రాబోయే కొన్ని రోజుల్లో దీనికి ఇంటర్నేషనల్ బాడీ తెరదించే అవకాశం ఉంది. ‘ఇది రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ కాదు. అందుకే ప్లేయింగ్ కండీషన్స్ ఎలా ఉంటాయో మాకూ తెలియదు. ముఖ్యంగా మూడు బేసిక్ పాయింట్లు మాకు తెలియాల్సి ఉంది. మ్యాచ్ డ్రా లేదా టై అయితే ఏం జరుగుతుంది. రెండు జట్లు కనీసం ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడకుండా మ్యాచ్ రద్దు అయితే ఏం చేస్తారు? వీటిపై మాకు స్పష్టమైన క్లారిటీ కావాలి’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నాడు. కచ్చితమైన తేదీ చెప్పకపోయినా.. వీలైనంత త్వరగా ఐసీసీ ప్లేయింగ్ కండీషన్స్ను అందజేస్తుందనే ఆశాభావంతో ఉన్నామన్నాడు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
రెండు వారాలు ముంబైలో..
దాదాపు నాలుగు నెలలకు పైగా సాగే ఇంగ్లండ్ టూర్కు ముందు టీమిండియా లాంగ్ క్వారంటైన్లో గడపనుంది. రెండు వారాలు ముంబైలో హార్డ్ క్వారంటైన్లో ఉండనుంది. ఆ తర్వాత జూన్ 2న చార్టెడ్ ఫ్లైట్లో లండన్ బయలుదేరుతుంది. అక్కడి నుంచి సౌతాంప్టన్కు వెళ్తుంది. అక్కడే 10 రోజుల క్వారంటైన్ పూర్తి చేస్తుంది. స్టేడియంలోనే ఉండే హోటల్లో విరాట్సేనకు బస ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ప్లేస్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ కూడా టెస్ట్ మ్యాచ్లు ఆడనున్నాయి. ముంబైలో నివాసం ఉన్న ప్లేయర్లు మినహా మిగతా వారు ఇప్పటికే హోటల్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఈ నెల 24న కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానె, జెమీమా రోడ్రిగ్స్, హెడ్ కోచ్ రవిశాస్త్రి.. హోటల్కు చేరుకుంటారు. అయితే ప్రస్తుతానికి ఇంట్లో ఉంటున్న వీళ్లకు బీసీసీఐ స్పెషల్ క్వారంటైన్ రూల్స్ను నిర్దేశించింది. వీళ్లతో పాటు హోటల్లో ఉన్న ప్లేయర్లందరికీ ప్రతి రోజు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు నిర్వహిస్తారు. ఇందులో నెగెటివ్ రిపోర్ట్స్ వస్తేనే యూకే ఫ్లైట్ ఎక్కుతారు. ‘ఇది ఐసీసీ మ్యాచ్ కావడంతో వాళ్ల రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. సౌతాంప్టన్ క్వారంటైన్కు సంబంధించిన సమాచారం త్వరలోనే మాకు అందుతుందని ఆశిస్తున్నాం’ అని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
సాఫ్ట్ క్వారంటైన్ కోసం పట్టు
సౌతాంప్టన్లో సాఫ్ట్ క్వారంటైన్ రూల్స్ కోసం బీసీసీఐ.. ఈసీబీ, యూకే గవర్నమెంట్పై ఒత్తిడి తెస్తోంది. క్వారంటైన్లో ఉన్న టైమ్లోనే ప్లేయర్లను ట్రెయినింగ్కు అనుమతించాలని కోరుతోంది. దీనివల్ల డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు కొద్దిగానైనా ప్రాక్టీస్ లభిస్తుందని టీమిండియా భావిస్తోంది. ఇక క్రికెటర్లతో పాటు వెళ్లే ఫ్యామిలీస్కు కూడా క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని బోర్డు డిమాండ్ చేస్తోంది. అయితే దీనిపై యూకే గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చే ట్రావెలర్స్ను ఇప్పటికే యూకే గవర్నమెంట్ రెడ్ లిస్ట్లో పెట్టింది. ఇండియాలోనే పుట్టిన బి. 1. 617.2 వేరియంట్ నుంచి డేంజర్ ఉంటుందేమోనని యూకే అథారిటీస్ భావిస్తున్నాయి.
సాహా, ప్రసిధ్... లేటుగా..
కరోనా నుంచి కోలుకున్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, స్టాండ్ బై పేసర్ ప్రసిధ్ కృష్ణ.. కొంచెం ఆలస్యంగా ముంబైకి చేరనున్నారు. దాదాపు రెండు వారాల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉన్న వీళ్లిద్దరూ.. బోర్డు స్పెషల్ పర్మిషన్తో ఫ్యామిలీతో గడుపుతున్నారు. సాహా కోల్కతాలో ఉండగా, ప్రసీధ్ బెంగళూరులో ఉన్నాడు. అయితే అనుకున్న టైమ్కు ప్రసిధ్ బబుల్లోకి రాకపోతే అతని ప్లేస్లో మన్దీప్ సింగ్ను తీసుకుంటారని వస్తున్న కథనాలు ఊహాగానాలేనని బోర్డు అధికారి ప్రకటించారు. ముంబై ప్లేయర్ సూర్యకుమార్ పేరు కూడా చక్కర్లు కొడుతున్నా.. అది కూడా అబద్దమేనని తేల్చాడు.