
ఖండ, సముద్ర భాగాలు ఉష్ణోగ్రతను గ్రహించడంలో ఉన్న మార్పుల వల్ల నైరుతి రుతుపవనాలు ఏర్పడతాయి. నైరుతి రుతుపవనాలను భారత ఉపఖండంలోకి ఆకర్షించే అల్పపీడన మండలం వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత మూలంగా ఏర్పడుతుంది. ఆగ్నేయ రుతుపవనాలు దక్షిణాసియా ప్రాంతంలో రూపాంతరం చెంది నైరుతి రుతుపవనాలుగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి.
రుతువులను అనుసరించి పవన దిశలో సుమారు 180 డిగ్రీలు మార్పు చెందుతాయి. వేసవి, శీతాకాలాల్లో పరస్పర విరుద్ధ లక్షణాలు గల వాయురాశులను కలిగి ఉంటాయి. అకస్మాత్తుగా దేశంలోకి ప్రవేశిస్తాయి. క్రమపద్ధతిలో దేశమంతటా విస్తరిస్తాయి. క్రమ పద్ధతిలో తిరోగమిస్తాయి. అనిశ్చితత్వ లక్షణాన్ని కలిగి ఉంటాయి. భారత్లో రుతుపవన వ్యవస్థపై ఎల్ నినో, లానినో, దక్షిణ డోలనం, వాకర్ సర్క్యులేషన్, అంతర ఆయన రేఖా అభిసరణ మండలం, అక్టోబర్ వేడి ప్రభావితం చేస్తాయి.
ఎల్నినో
ఎల్నినో లాటిన్ భాషా పదం. దీనిని మొదటిసారిగా శాస్త్రవేత్త క్రైస్ట్ బేబీ ఉపయోగించారు. ప్రతి ఐదు లేదా ఏడు సంవత్సరాలకు ఒకసారి దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్రంలోని పెరూ తీర ప్రాంతంలో ఉష్ణజలరాశి వల్ల అధిక ఉష్ణోగ్రత మూలంగా అక్కడ అధిక స్థాయిలో అల్పపీడన స్థితి ఏర్పడుతుంది. దీనినే ఎల్ నినో అంటారు.
ఫలితాలు
పెరూ తీరంలో అల్పపీడనం ఉండటం వల్ల భారత్ పైకి వీచే నైరుతి రుతుపవనాలు అక్కడికి లాగబడతాయి. దీని మూలంగా భారత్లో కరువు పరిస్థితులు ఏర్పడతాయి. పెరూ తీరంలో అధిక సంఖ్యలో చేపలు మరణిస్తాయి.
లానినో
పెరూ తీరానికి పక్కగా వెళ్లే హంబోల్ట్ శీతల ప్రవాహం మూలంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గి అధిక పీడన పరిస్థితులు ఏర్పడటాన్నే లానినో అంటారు. ఫలితంగా భారతదేశం మీదకి రుతుపవనాలు అధికంగా వీస్తాయి. దీని మూలంగా భారత్లో అధిక వర్షాలు సంభవిస్తాయి. పెరూ తీరంలో కరువు పరిస్థితులు ఏర్పడతాయి.
దక్షిణ డోలనం
పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం మీదికి పవనాలు దక్షిణ దిక్కున అటూ ఇటూ స్థానాలు మారుతూ కదలడాన్ని దక్షిణ డోలనం అంటారు. ఈ దక్షిణ డోలనం జరిగేటప్పుడు ఎల్ నినో ఏర్పడితే దానిని ఎల్సో ఎఫెక్ట్ అంటారు.
అంతర ఆయన రేఖా అభిసరణ మండలం
ఉత్తరార్ధ గోళంలోని ఈశాన్య వ్యాపార పవనాలు, దక్షిణార్ధ గోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖ వద్ద కలిసే మండలాన్ని అంతర ఆయన రేఖా అభిసరణ మండలం(ఐటీసీజెడ్) అంటారు. ఈ ఐటీసీజెడ్ వేసవి కాలంలో ఉత్తరార్ధ గోళంలో 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఐటీసీజెడ్ 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీదికి లాగబడుతుంది. దీనినే రుతుపవన ఆరంభం అంటారు. శీతాకాలం, వర్షాకాలంలో ఐటీసీజెడ్ వ్యతిరేక దిశలో అంటే సముద్రాల మీదికి మారుతుంది.
వాకర్ సర్క్యులేషన్
హిందూ మహాసముద్రం, పసిఫిక్ సముద్రం మీది పవనాలు భూభాగం మీద ఉన్న అధిక, అల్ప పీడనాలను ఆసరాగా చేసుకుని వృత్తాకారంలో చలిస్తూ ఉండటాన్ని వాకర్ సర్క్యులేషన్ అంటారు. ఈ వృత్తాన్ని మొదటిసారిగా సర్ గిల్బర్ట్ వాకర్ గుర్తించారు.
అక్టోబర్ వేడి
ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ చివరి నాటికి దశలవారీగా నిష్క్రమిస్తాయి. అక్టోబర్ నాటికి పవనాలన్నీ సముద్రం మీదకు వెళ్లిపోయి ఉత్తర భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది. దీనినే అక్టోబర్ వేడి అంటారు.
ఇండియన్ ఓషియన్ డైపోల్
భారతదేశానికి దక్షిణ భాగంలో ఉన్న హిందు మహాసముద్రంలో భూమధ్యరేఖ ప్రాంతాల్లో సముద్రజలం వేడెక్కుతుంది. పశ్చిమ హిందూ మహాసముద్రంలో అరేబియా సముద్రం కలిసే భాగంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.40 సెంటీగ్రేడ్లు పెరిగితే దాని ప్రభావం తూర్పు భాగంలో బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంతో కలిసే చోట ఉష్ణోగ్రత కొంచెం తగ్గుతుంది.
ఈ రెండు ప్రాంతాలను హిందు మహాసముద్రం రెండు ధ్రువాలుగా వర్ణించవచ్చు. హిందూ మహాసముద్ర తూర్పుభాగంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల అక్కడి గాలులు నైరుతి రుతుపవనాలను బలంగా భారత్ వైపు నెట్టుతాయి. దీనిమూలంగా భారత్లో సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయి. ఈ సందర్భంలో సమీపంలోని ఇండోనేషియా, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో కరువు ఏర్పడే అవకాశం ఉన్నది.
హిందూ మహాసముద్రం తూర్పుభాగంలో ఉష్ణోగ్రత పెరిగితే ఆస్ట్రేలియాలో వర్షాలు అధికంగా కురుస్తాయి. ఎల్నినో, ఇండియన్ ఓషియన్ డైపోల్లు రెండు వేర్వేరు వాతావరణ ప్రభావిత అంశాలు. ఇవి ఒకేసారి ఏర్పడకపోవచ్చు. భారత్పై ఎల్ నినో ప్రభావం ఉన్నా కానీ ఇండియన్ ఎషియన్ డైపోల్ సానుకూలంగా ఉండటం వల్ల వర్షపాతం సాధారణ స్థాయిలో ఉంటుంది.