
తిరుమల.. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయం. అత్యంత ధనవంతమైన దేవస్థానం. ఇంతటి ప్రసిద్ధి, ఇంత ప్రాచుర్యం ఒక్క రోజులో రాలేదు. కొన్ని వందల ఏళ్లుగా వెలుగొందుతున్న శ్రీవారి ఆలయం వెనుక ఎంతో చరిత్ర, ఎన్నో స్థలపురాణాలు ఉన్నాయి. రాజుల పాలన నుంచి బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్లిన ఆలయం.. ఎలా తన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోగలిగింది.. ఎలా కొనసాగిస్తూ వస్తోంది..? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుమల నిర్వహణలో ఏం చేసింది..? మహంతుల చేతుల్లోంచి పాలన ఎలా వేరుపడింది.. టీటీడీ పాలక మండలి ఏర్పాటు వెనుక ఉన్న చరిత్ర ఏమిటి..? హథీరాంజీ మఠానికీ, శ్రీవారి ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి..? తిరుమల గురించి సమగ్రమైన ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో శేషాచలం ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల. కలియుగ వైకుంఠంగా పిలుస్తున్న ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడిగా కొలువై భక్తుల కోరికలను తీరుస్తాడని విశ్వాసం. బ్రిటిష్ ఈస్టిండియా పాలన నుంచి ప్రత్యే బోర్డుగా ఏర్పడే వరకు ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది.
19వ శతాబ్దంలో1817లో మద్రాసు ప్రభుత్వం ఏడవ రెగ్యులేషన్ ద్వారా శ్రీవారి ఆలయాన్ని ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నియంత్రణలోకి తెచ్చింది. 1821లో బ్రూస్ అనే బ్రిటిష్ అధికారి ఆలయ నిర్వహణ కోసం "బ్రూస్ కోడ్" నియమాలను రూపొందించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలయ పరిపాలనను 1843లో హథీరాంజీ మఠం మహంతులకు అప్పగించింది. అప్పటి నుంచి 1933 వరకు మహంతుల పాలనలోనే ఆలయం విలసిల్లింది.
టీటీడీ పాలక మండలి ఏర్పాటు:
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి స్వాతంత్ర్యం రాకముందే ఏర్పాటైంది. అంతకు ముందు మహంతుల పాలనలో ఉన్న ఆలయం.. ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం 1933లో టీటీడీకి పాలక మండలి వ్యవస్థ తీసుకుని రావడం వల్ల మహంతుల వ్యవస్థ ముగిసింది. దీంతో పాలనా వ్యవహారాలు అధికారుల చేతిలోకి వెళ్ళాయి. పాలనా వ్యవహారాలు మారినా, సుదీర్ఘకాలం తిరుమల, టీటీడీ వ్యవహారాలు పర్యవేక్షించిన మహంతులకు ప్రత్యేక గౌరవం ఈనాటికి కొనసాగుతోంది. అయితే తిరుమల ఆచార వ్యవహారాలలో మహంతుల పాత్ర ఏంటి..? హథీరాంజీ మఠానికి తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
హథీరాంజీ మఠానికి, తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న చరిత్ర:
ఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని క్రేడల్ క్రేల గ్రామంలో రామానంద మఠం ఉండేది. మఠం అధిపతి అభయ్ ఆనంద్ జీ శిష్యుడు హథీరాంజీ దేశయాత్రలో భాగంగా వెంకటాచలానికి చేరుకున్నాడనేది చరిత్ర . శ్రీవేంకటేశ్వరుడిని అయోధ్య రాముడి అంశగా భావించి, కొలుస్తూ ప్రసన్నం చేసుకునేవారంట. బావాజీ భక్తికి ముగ్దుడైన శ్రీవారు నిత్యం ఆనందనిలయం దాటి ఆలయానికి సమీపంలోనే ఉన్న హథీరాంజీ బావాజీతో పాచికలాడుతూ, భక్తుడిని గెలిపించి, ఆనందపడేవారనే కథలు ఉన్నాయి.
తిరుమలలో శ్రీవారి పేరు తరువాత వినిపించే పేరు విశ్వక్ సేనుడు. టీటీడీ పాలనా వ్యవహారాలు మహంతుల చేతికి ఈస్టిండియా కంపెనీ అప్పగించినప్పటికీ.. ఆలయ నిత్యకలాపాల్లో లోటు లేకుండా చేశారు. అదే సమయంలో పాలనా పగ్గాలు చేతికి తీసుకున్న మహంతులు (హథీరాంజీ బాబా వారసులు) తమ పాలనకు విశ్వక్ సేనుడి అధికార ముద్ర (సీలు)ను వాడారు. మొదటి మహంతు సేవాదాస్ కాలంలోనే శ్రీవారి పుష్కరిణిలో జలకేళీ మండపోత్సవం పేరిట తెప్పోత్సవం ప్రారంభించారు. తిరుమల శ్రీవారికి మహంతు బాబాజీ పేరుతో సుప్రభాత సేవలో గోక్షీర నివేదన, నవనీత హారతి సమర్పించే ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజూ వేకువజామున సుప్రభాత సమయంలో శ్రీవారికి సంప్రదాయ బద్ధంగా హరతీ అందిస్తున్నారు.
ఆణివార ఆస్థానం సంప్రదాయం వెనుక..
వందల సంవత్సరాలు కాలంలో కలిసిపోయినా, తిరుమలలో మాత్రం ఆనాటి ఆచార వ్యవహారలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా కొనసాగిస్తున్నారు. అందులో ఒకటి ఆణివార ఆస్థానం కార్యక్రమం. శాస్త్రోక్తంగా నిర్వహించడంలో టీటీడీ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తిరుమలలో ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక పెద్ద కథే ఉంది.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆర్కాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈస్టిండియా కంపెనీ పాలన సాగించింది. దీంతో 1843 ఏప్రిల్ 21 నుంచి 1933 వరకు ఆలయ పాలన హధీరాంజీ మఠం మహంతుల పాలనలో సాగింది. తిరుమల ఆలయానికి మొదటి మహంతుగా1843 జూలై 10న మహంత్ సేవాదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆణివార ఆస్థానం రోజే బ్రిటీషర్లు శ్రీవారి ఆలయ ఆస్తులు, ఆభరణాలు, ఉత్సవ మూర్తులు, ఉత్సవర్లకు ఊరేగింపులో వాడే వాహనాలు, నిత్య కైంకర్యాలకు వాడే పురాతన వస్తువులు, రికార్డులు, లెక్కల అప్పగింత జరిగింది.
ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తరహా సమీక్ష జరిగేది. టీటీడీ పాలక మండలి ఏర్పడిన తరువాత ఇది కాస్తా వార్షిక బడ్డెట్ గా మారింది. కానీ, వందల ఏళ్ల నాటి సంస్కృతీ, సంప్రదాయాలు మాత్రం ఆచరిస్తూనే, ఆ నాటి చరిత్ర మరుగున పడకుండా, మహంతుల పరిపాలనా కాలం నాటి పద్ధతుల్లోనే శ్రీవారికి ఆణివార ఆస్థానం ద్వారా లెక్కలు నివేదించడం అనే సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నారు.