తెలంగాణలో కామ్రేడ్స్ .. చివరికి ఇలా మిగిలిపోయారు!

తెలంగాణలో కామ్రేడ్స్ .. చివరికి ఇలా మిగిలిపోయారు!

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వామపక్షాల పరిస్థితిని చూస్తే ప్రముఖ సాహితీవేత్త చలసాని ప్రసాద్‌‌ ఎంతో ఆవేదనతో చెప్పిన ‘చివరికి ఇలా మిగిలాం...’ అనే మాటలు గుర్తుకొస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టులు నేడు ఉనికి కోసం పోరాడుతున్నారు. వామపక్షాలంటే ప్రజల్లో ఇప్పటికీ ఆదరాభిమానాలు ఉన్నా.. ఆ పార్టీలు ప్రజాకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకుండా అవకాశవాద రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై వాటి సానుభూతిపరులు ఆవేదన చెందుతున్నారు.

అపుడు ఉనికి, ఇపుడు శూన్యం

ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం వామపక్షాలు  పొత్తుల వైపుకు మళ్లాయి. 1983లో ఎన్టీఆర్‌‌ ప్రభంజనంలోనూ ఒంటరిగా  సీపీఐ 4, సీపీఐ(ఎం) 5 స్థానాల్లో గెలిచాయి. అనంతరం 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు టీడీపీతో జతకట్టాయి. 1999 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వామపక్షాలు ఒంటరిగా పోటీ చేయగా సీపీఐ(ఎం) రెండు స్థానాలను పొందింది. సీపీఐకి ఒక స్థానం కూడా రాలేదు. 2004లో ఎన్‌‌డీఏకి వ్యతిరేకంగా యూపీఏతో జతకట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ 6, సీపీఐ(ఎం) 9 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్‌‌తో ఏర్పడిన విభేదాలతో 2009 ఎన్నికల్లో ‘అవినీతి కాంగ్రెస్‌‌’, ‘మతతత్వ బీజేపీ’లకు వ్యతిరేక నినాదాలతో టీడీపీ, బీఆర్‌‌ఎస్‌‌ కూటమితో వామపక్షాలు జతకట్టగా సీపీఐ 4, సీపీఐ(ఎం) ఒక స్థానం సాధించింది. తెలంగాణ ఉద్యమంతో వామపక్షాలకు కష్టాలు ఎదురయ్యాయి. 

ప్రత్యేక రాష్ట్రానికి సీపీఐ మద్దతివ్వగా, సీపీఐ(ఎం) వ్యతిరేకించింది. ఈ నిర్ణయాలతో ఏదో ఒక రాష్ట్రంలో వారు బలపడ్డారా అంటే అదీ లేదు. అనంతరం పరిణామాలతో రెండు రాష్ట్రాల్లోనూ ఉభయ పార్టీలు ఎదురీదుతూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణలో సీపీఐ(ఎం) వైఎస్‌‌ఆర్‌‌సీపీతో కలిసి, సీపీఐ కాంగ్రెస్‌‌తో జతకట్టి చెరో స్థానం సాధించాయి.  2018 ఎన్నికల్లో బలపడాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ‘మహాజన’ పాదయాత్ర చేపట్టి, బహుజన లెఫ్ట్‌‌ ఫ్రంట్‌‌ (బీఎల్‌‌ఎఫ్‌‌)ను ఏర్పాటు చేసింది. మరోవైపు సీపీఐ బీఎల్‌‌ఎఫ్‌‌లో చేరకుండా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌, టీడీపీ, టీజేఎస్‌‌ మహాకూటమితో జతకట్టింది. 

వామపక్షాలు ఈ ఎన్నికల్లో ఒక సీటు కూడా సాధించక ఘోరమైన ఓటమిని పొందాయి. గతంలో ఒక వెలుగు వెలిగిన వామపక్షాలకు ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడమే. కమ్యూనిస్టు సిద్ధాంతాలను యువతకు చేరవేయడంలో నాయకత్వం విఫలమవుతోంది.  పార్టీల్లో సభ్యత్వం, చేరికలు కరువైనాయి.  కార్యకర్తలు ఎంత సేపు పార్టీతో లాభం పొందాలనే చూస్తున్నారే కానీ, పార్టీ అభివృద్ధికి కృషి చేయడం లేదని పాతతరం నేతలు బాధపడుతున్నారు. ప్రెస్‌‌మీట్లు, సోషల్‌‌ మీడియా పోస్టర్లు, ఫోటోల కోసం ధర్నాలకే పార్టీలు పరిమితమయ్యాయి. పార్టీకి మీడియాలో ప్రాధాన్యతుండాలని ప్రింట్‌‌, టీవీ, సోషల్‌‌ మీడియాలను సొంతంగా ప్రారంభించగా అవీ  వివాదాస్పదమయ్యాయి. 

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం..

కేసీఆర్‌‌ ప్రకటించిన బీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థుల జాబితాను చూసి ప్రతిపక్ష కాంగ్రెస్‌‌, బీజేపీల కంటే మిత్రపక్షంగా చేప్పుకున్న వామపక్షాలు షాక్‌‌తిన్నాయి.  ఉద్యమాలకు మారుపేరైన వామపక్షాలు ఎప్పుడైతే బీఆర్‌‌ఎస్‌‌తో పొత్తు కోసం తహతహలాడాయో అప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడాన్ని మర్చిపోయారు. వామపక్షాలు ‘ఇండియా’ కూటమిలో ఉండడంపై గతంలో జరిగిన చర్చల్లో బీఆర్‌‌ఎస్‌‌ అసంతృప్తి వ్యక్తం చేసిందని కమ్యునిస్టు నేతలు ఇప్పుడు బయటపెట్టారు. 

అప్పటి సమావేశ వివరాలను రహస్యంగా ఉంచడంలోనే నాయకుల లోగుట్టు ఉంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కూటమిలో వామపక్షాలు క్రియాశీలక పాత్ర పోషిస్తుండగా ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌‌కు వ్యతిరేకంగా ఉన్న బీఆర్‌‌ఎస్‌‌తో పొత్తు కోసం పాకులాడడమే తప్పిదం. కాంగ్రెస్‌‌తోనైనా పొత్తు పెట్టుకుంటే అసెంబ్లీలో కనీసం ప్రాతినిధ్యం వస్తుందనే ఆలోచనలో ఇప్పుడు వామపక్షాలున్నట్లు వార్తలొస్తున్నాయి.

దబ్బడం, గుండుసూదులు అన్నపుడే తెలిసుండాలి

కమ్యూనిస్టుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌‌ను బీఆర్‌‌ఎస్‌‌లో చేర్చుకున్నప్పుడే వామపక్షాలకు కేసీఆర్‌‌ వ్యవహారశైలిపై జ్ఞానోదయం కావాల్సింది. రాజకీయాల్లో అవకాశవాదం, మిత్రద్రోహం కొత్తేమి కావు. వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్న వామపక్షాలకు వీటి గురించి మరింత ఎక్కువగానే తెలిసుండాలి. గతంలో కేసీఆర్‌‌ వామపక్షాలను దబ్బడం,గుండుసూదీలతో పోల్చినప్పుడే ఆ మాటలు వారి గుండెల్లో గుచ్చుకొని ఉండాల్సింది. ఇంతకుముందు బీజేపీ ఓటమే లక్ష్యంగా ముందుకుసాగిన వామపక్షాలు ఇప్పుడు బీఆర్‌‌ఎస్‌‌ ఓటమే లక్ష్యం అంటున్నాయి. ఎప్పుడూ ఒకరి ఓటమి లక్ష్యంగా రాజకీయాలు నడిపే బదులు తమ గెలుపుకు కృషి చేస్తే బాగుంటుంది. 

మునుగోడులో కాంగ్రెస్​ను కాదని..

తెలంగాణలో బీజేపీ బలపడుతున్న దశలో వామపక్షాలకు మునుగోడు ఉప ఎన్నిక వరంగా మారింది. ఈ ఎన్నికలో వామపక్షాలతో జతకట్టేందుకు కాంగ్రెస్‌‌ చొరవతీసుకుంటున్న సమయంలో  సీపీఐ(ఎం), సీపీఐ పోటీపడి బీఆర్‌‌ఎస్‌‌కు మద్దతిచ్చాయి. మునుగోడులో సీపీఐకి ఐదుసార్లు గెలిచిన చరిత్ర ఉందని, ఇక్కడ పాతికవేలకు పైగా ఓటు బ్యాంకు వామపక్షాలకు ఉండడంతో పొత్తు వద్దని, సొంతంగా బరిలోకి దిగుదామని కార్యకర్తలు ఎంత చెప్పినా అగ్రనేతలు పెడచెవిన పెట్టారు. 

మునుగోడులో పోటీ చేసి, కేసీఆర్‌‌కు వారి బలాన్ని చూపించే అవకాశాన్ని కమ్యూనిస్టులు జారవిడుచుకున్నారు. మునుగోడులో గెలిచినంక కేసీఆర్‌‌ వామపక్షాలకు అపాయింట్‌‌మెంట్‌‌ ఇవ్వకపోయినా ఆయన వ్యూహాన్ని పసిగట్టలేకపోయిన కమ్యూనిస్టు నేతలు వారికి సంబంధించి కనీసం 2 సీట్లు ఇచ్చినా చాలనుకున్నారు. వామపక్ష నేతల బలహీనతలను గుర్తించిన కేసీఆర్‌‌ చివరికి వారిని చీపురుపుల్లాలా పక్కనపడేశారు.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,  పొలిటికల్​ ఎనలిస్ట్​