బాధితురాలికి న్యాయం చేయాలని ప్రతిపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ/ లక్నో:ఉన్నావ్ రేప్కేసు బాధితురాలు యాక్సిడెంట్లో గాయపడ్డ సంఘటన మంగళవారం లోక్సభను కుదిపేసింది. కాంగ్రెస్తోపాటు ప్రతిపక్ష సభ్యులు దీనిపై నిరసనలు తెలిపారు. నినాదాలు చేశారు. ఉత్తర్ప్రదేశ్ సర్కార్ బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రతిపక్ష సభ్యులకు బీజేపీ హామీ ఇ చ్చింది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు రేప్ కేసు బాధితురాలికి జరిగిన యాక్సిడెంట్ అంశాన్ని లేవనెత్తారు. వాళ్లకు తృణమూల్, డీఎంకే, బీఎస్పీ, ఇతర సభ్యులు మద్దతు తెలిపారు. 30 మందికి పైగా సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. ‘ బాధితురాలికి న్యాయంచేయాలి’ అంటూ సుమారు 40 నిమిషాలపాటు నినాదాలు చేశారు. కాంగ్రెస్, తృణమూల్, బీఎస్పీ, డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బాధితురాలి కుటుంబానికి సెక్యూరిటీని పెంచాలని అంతకుముందు సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌధురి డిమాండ్ చేశారు. ఉన్నావ్ ఘటనను రాజకీయం చేయొద్దని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపక్షాలను కోరారు. బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న ట్రక్కు సమాజ్వాదీపార్టీ కార్యకర్తదని రూరల్డెవలప్మెంట్ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చెప్పారు.
మహిళా హక్కుల సంఘాల నిరసనలు
ఉన్నావ్ రేప్ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు మహిళా హక్కుల సంఘాల నాయకులు ఇక్కడి యూపీ భవన్ ఎదుట నిరసనలు జరిపారు. రేప్ కేసులో బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యూపీ భవన్ ప్రతినిధులకు ఒక మెమొరాండం అందజేశారు.
సెంగార్ను ఎప్పుడో సస్పెండ్ చేశాం:
యూపీ బీజేపీ చీఫ్
ఉన్నవ్ యాక్సిడెంట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై బీజేపీ మంగళవారం క్లారిటీ ఇచ్చింది. ఇంతకుముందే సెంగాన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్ సింగ్ చెప్పారు.
జూన్11, 2017: ఉత్తరప్రదేశ్లోని మాంఖి గ్రామం నుంచి ఓ బాలిక అదృశ్యం. ఆమె కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్లో కుటుంబసభ్యుల మిస్సింగ్కంప్లెయింట్.
జూన్17, 2017: ఉద్యోగం ఇప్పిస్తామంటూ ప్రలోభపెట్టి, ఆ బాలికపై కుల్దీప్సింగ్సెంగార్, అతడి సోదరుడు అతుల్సింగ్, ఇతర అనుచరుల గ్యాంగ్రేప్. అప్పుడు ఆ బాలిక మైనర్. వయసు 17 ఏండ్లు. యూపీలో ఆదిత్యనాథ్ సర్కారు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ ఘటన జరిగింది.
జూన్20, 2017: ఆర్రాయియాలో కనిపించిన బాలిక. ఉన్నావ్కు తీసుకొచ్చిన పోలీసులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు, మాంఖి పోలీసు స్టేషన్లో సెక్షన్363 (కిడ్నాపింగ్), 366 (బలవంతంగా పెండ్లి చేసుకునేందుకు కిడ్నాప్ చేయడం) కింద కేసు రిజిస్టర్చేసినట్లు పోలీసుల ప్రకటన.
ఏప్రిల్3, 2018: కేసు విచారణ కోసం ఉన్నావ్బయలుదేరిన బాలిక కుటుంబం. బాధితురాలి తండ్రి సురేంద్రపై పట్టపగలే దాడి చేసిన అతుల్సింగ్, అతడి అనుచరులు. కుటుంబం ముందే చెట్టుకు కట్టేసి కర్రలు, బెల్టులు, రాడ్లతో తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన సురేంద్ర. అతుల్ పై ఫిర్యాదు చేసినా, ఎమ్మెల్యే తమ్ముడే దాడి చేశాడని సురేంద్ర చెబుతున్న వీడియో బయటకు వచ్చినా, అతుల్ పేరు లేకుండా, ఐదుగురు వ్యక్తులు దాడి చేసినట్లు ఎఫ్ఐఆర్నమోదు చేసిన పోలీసులు.
ఏప్రిల్4, 2018: అక్రమంగా తుపాకులు ఉన్నాయంటూ సురేంద్రను అరెస్టు చేసిన పోలీసులు. తీవ్రగాయాలైనా అతడిని డాక్టర్లు హాస్పిటల్లో చేర్చుకోలేదు. పోలీసులు కస్టడీలోనే చంపుతారేమోనని కుటుంబసభ్యుల ఆందోళన.
ఏప్రిల్8, 2018: నిందితులందరినీ అరెస్టు చేయాలని, లేకపోతే ఆత్మాహుతి చేసుకుంటానంటూ లక్నోలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ఇంటి ముందు బాధితురాలి ఆందోళన. దీంతో ఈ కేసు జాతీయ స్థాయిలో లైమ్లైట్ లోకి వచ్చింది.
ఏప్రిల్9, 2018: పోలీసు కస్టడీలో సురేంద్ర మృతి. చేతులు, తొడలు, కాళ్లు, పొత్తికడుపు, మోకాళ్లు, పిరుదులపై అనేక గాయాలు ఉన్నాయని, పెద్ద పేగుకు రంధ్రాలు పడి, రక్తం కారి, బ్లడ్పాయిజనింగ్అయిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి. అతడిని టార్చర్పెట్టలేదన్న పోలీసులు. బాధితులకు న్యాయం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు.
ఏప్రిల్10, 2018: సురేంద్రను కొట్టినందుకు అతుల్ సింగ్, మరో నలుగురి అరెస్టు.
ఏప్రిల్12, 2018: ఎమ్మెల్యే సెంగార్పై పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద కిడ్నాప్, రేప్ ఆరోపణలతో కేసు నమోదు.
ఏప్రిల్13, 2018: సెంగార్ను ఆయన ఇంట్లో విచారణ కోసం అదుపులోకి తీసుకున్న సీబీఐ.
జూలై 28, 2019: బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో కుటుంబసభ్యులిద్దరు మృతి. బాధితురాలు, లాయర్కు సీరియస్.