డిసెంబర్‌‌‌‌లోనా? పార్లమెంట్‌‌తోనా?.. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడు?

డిసెంబర్‌‌‌‌లోనా? పార్లమెంట్‌‌తోనా?..  రాష్ట్రంలో ఎన్నికలెప్పుడు?
  •     జమిలి ప్రచారం నేపథ్యంలో అనుమానాలు
  •     పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తర్వాత క్లారిటీ?
  •     రాష్ట్రంలో లక్షలాది బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు
  •     బోగస్ ఓట్ల ఏరివేతకు ఈసీ ఆదేశిస్తే..ఎన్నికలు లేట్ కావచ్చని ఊహాగానాలు
  •     ఇప్పటికే ప్రచారంలో స్పీడ్ తగ్గించిన బీఆర్ఎస్
  •     షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్లు అంటున్న బీజేపీ
  •     హైదరాబాద్‌‌లో జరిగే సీడబ్ల్యూసీ మీటింగ్‌‌పైనే కాంగ్రెస్ ఫోకస్

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలెప్పుడు? రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్‌‌ టాపిక్! షెడ్యూల్‌‌ ప్రకారం డిసెంబర్‌‌‌‌లో ఎలక్షన్లు జరుగుతాయా? లేక ఆలస్యమవుతాయా? వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంట్ ఎన్నికలతోపాటే ‘జమిలి’కి చాన్స్‌‌ ఉందా? అనే కన్ఫ్యూజన్ కొనసాగుతున్నది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఈ సందేహాలతోనే  వెనుకా ముందు ఆడుతున్నాయి. అక్టోబర్ 12లోగా షెడ్యూల్ రాకుంటే ఇప్పట్లో ఎన్నికలు జరిగేది అనుమానమేనని, జమిలి ఎన్నికలు రావచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. బీజేపీ నేతలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని పదేపదే చెప్తున్నారు. ఆలస్యమవుతుందనేది వట్టి ప్రచారం మాత్రమేనని అంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంట్ స్పెషల్ సెషన్స్‌‌లో ఏయే బిల్లులుంటాయనే సస్పెన్స్ కొనసాగుతున్నది. 

దీంతో ఈ సమావేశాలు పూర్తయితే కానీ రాష్ట్ర ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్​, బీజేపీ వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణతోపాటు చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో డిసెంబర్‌‌‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మిగతా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు పెట్టేసి.. ఒక్క తెలంగాణ ఎన్నికలను మాత్రమే వాయిదా వేస్తారని లీడర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వెనక్కి తగ్గిన బీఆర్ఎస్

2018లో డిసెంబర్ 7న పోలింగ్ జరగ్గా.. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గెలవడంతో కేసీఆర్ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం కొలువుదీరింది. ఈసారి అసెంబ్లీకి డిసెంబర్‌‌‌‌లోనే ఎన్నికలు ఉండొచ్చనే అంచనాతో బీఆర్ఎస్​ ఆగస్టు 21వ తేదీన 115 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది. కేవలం నాలుగు సీట్లను మాత్రమే పెండింగ్‌‌లో పెట్టింది. అభ్యర్థులను ప్రకటించిన రోజు నుంచే గులాబీ లీడర్లు ప్రచారం మొదలు పెట్టారు. అసంతృప్తులను బుజ్జగించడం, లోకల్ లీడర్లను అట్టిపెట్టుకోవడం, ఇతరత్రా వ్యవహారాలతో వారికి ఖర్చు తడిసి మోపెడవుతున్నది. ఈ క్రమంలో డిసెంబర్‌‌‌‌లో ఎన్నికలు ఉండకపోవచ్చనే అంచనాతో గులాబీ పార్టీ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఒకవేళ పార్లమెంట్‌‌తో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అప్పటి వరకు భారీ మొత్తం ఖర్చు పెట్టాల్సి రావడం, కేటీఆర్ ఇటీవల మీడియా చిట్ చాట్‌‌లో ఎన్నికలపై చేసిన కామెంట్లతో సిట్టింగ్‌‌లందరూ గందరగోళానికి గురయ్యారు. ఇతర పార్టీలు కూడా డైలమాలో పడ్డాయి. ఇతర పార్టీలను గందరగోళ పరిచేందుకే కేటీఆర్ ఇలాంటి కామెంట్స్ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. కానీ పార్లమెంట్ సెషన్‌‌లో జమిలిపై ఏదో ఒక నిర్ణయం ఉంటుందనే చర్చలు ఢిల్లీ సర్కిల్స్‌‌లో బలంగా వినిపిస్తున్నాయి. అందుకే బీఆర్ఎస్ వెయిట్ అండ్ సీ అన్న ధోరణి అనుసరిస్తున్నది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ప్రచారం వద్దంటూ ఎమ్మెల్యేలను కేసీఆర్ అలర్ట్ చేశారు.

సీడబ్ల్యూసీపై కాంగ్రెస్, 17పై బీజేపీ ఫోకస్

ఎన్నికలు లేట్ అవుతాయనే ప్రచారం బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై పడింది. ఇప్పటికే ఆ రెండు పార్టీలు ఎమ్మెల్యే ఆశావాహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించాయి. కాంగ్రెస్‌‌కు 1,025 మంది, బీజేపీకి 6,003 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని వడపోసి హైకమాండ్​కు పంపించి.. లిస్ట్ రిలీజ్ చేయటమే తరువాయి. ఈ నెలలోనే అభ్యర్థులను ప్రకటించాలని భావించిన కాంగ్రెస్.. తాజా పరిణామాలతో వెనక్కి తగ్గింది. హైదరాబాద్‌‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు, తుక్కుగూడలో విజయభేరి సభ ఏర్పాట్లపైనే ఫోకస్ పెట్టింది. బీజేపీది కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతానికి అప్లికేషన్ల వడపోతను ఆపేసింది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాల నిర్వహణపై దృష్టి పెట్టింది. దీంతో బీఆర్ఎస్ కూడా వరుసగా రెండో ఏడాది ప్రభుత్వం అధ్వర్యంలో  సమైక్యతా వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంది. ఈలోగా పార్లమెంట్ స్పెషల్ సెషన్‌‌లో ఏం జరుగుతుందనేది తేలిపోతుందని మూడు పార్టీలు భావిస్తున్నాయి.

బోగస్ ఓట్లపై ఈసీకి ఫిర్యాదులు

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు ఉండటాన్ని ఈసీ గుర్తించింది. దాదాపు 15 లక్షల వరకు బోగస్ ఓట్లు ఉన్నాయని రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి. ఒక్కో ఇంటి నంబర్‌‌‌‌పై వందల ఓట్లు ఉన్నట్టుగా ఫీల్డ్ సర్వేలో నిర్ధారణ అయింది. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఈ సంఖ్య పెద్ద ఎత్తున ఉందనే ఆరోపణలున్నాయి. దీంతో ఈసీ కూడా వీటిపై దృష్టి సారించింది. ఒకవేళ బోగస్ ఓట్ల ఏరివేతకు ఈసీ ఆదేశిస్తే.. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఆలస్యం కావొచ్చనే అనుమానాలు నెలకొన్నాయి.