కారులో వెళ్తుండగా ఆపి.. కత్తులతో పొడిచి చంపారు

కారులో వెళ్తుండగా ఆపి.. కత్తులతో పొడిచి చంపారు

హైదరాబాద్‌,వెలుగు: కారులో వెళ్తున్న వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన ఘటన ఓల్ట్​సిటీలోని చాంద్రాయణగుట్ట పీఎస్‌ లిమిట్స్‌ బండ్లగూడ హస్మాబాద్‌లో జరిగింది. బార్కాస్‌కి చెందిన హమీద్‌ బిన్‌ జువేది(45) చాంద్రాయణగుట్టలో వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్​ఫర్‌‌ ఆఫీస్‌ నిర్వహిస్తున్నాడు. బుధవారం సాయంత్రం చాంద్రాయణగుట్ట నుంచి బండ్లగూడ రూట్‌లో అతడు కారులో వెళ్తుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. బండ్లగూడ హైవే రోడ్డుపై అందరూ చూస్తుండగానే హమీద్​పై  కత్తులు, రాళ్లతో దాడి చేసి పారిపోయారు.  స్థానికులు సమాచారం ఇవ్వగా పోలీసులు వెళ్లి హమీద్‌ను ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డెడ్‌ బాడీని పోస్ట్​మార్టం నిమిత్తం  మార్చురీకి తరలించారు. నిందితులు రాయిస్​జాబ్రీ అలియాస్​ రాయిస్​ రుబైయా, అదిల్​, సయీద్​లను అరెస్ట్​ చేశామని  సౌత్‌ జోన్ డీసీపీ గజరావ్‌ భూపాల్‌ తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హమీద్‌ మర్డర్​కు కారణమని అనుమానిస్తున్నామని చెప్పారు.

వ్యక్తి దాడిలో బార్​ సిబ్బందికి గాయాలు

శంషాబాద్, వెలుగు:  రెస్టారెంట్ సిబ్బందిపై వ్యక్తి దాడి చేసిన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాని బార్​లో చోటు చేసుకుంది.  రవి అనే వ్యక్తి బుధవారం బారుకు వచ్చి తాగి బిల్ డిస్కౌంట్ కావాలని సిబ్బందితో గొడవకు దిగాడు. డిస్కౌంట్ ఇవ్వడం కుదరదని చెప్పారు.  వినాయక చందా ఇవ్వలేదని మనసులో పెట్టుకున్న రవి, బార్  సిబ్బంది రామకృష్ణ, సాయిధర్​గౌడ్, అనిల్ సింగ్ పై దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో  పోలీసులు గాయపడిన వారిని హాస్పిటల్​కు తరలించారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు రవిపై  కేసు ఫైల్​ చేశామని సీఐ కనకయ్య చెప్పారు.