
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష పాత్ర పోషించలేక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితమయ్యారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్లో జరిగిన “అందుబాటులో ప్రజాప్రతినిధులు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రజల ఫిర్యాదులపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ నుంచి “తెలంగాణ” పదం తొలగించినప్పుడే ఆ పార్టీకి తెలంగాణతో ఉన్న సంబంధం తెగిపోయిందని ఆది శ్రీనివాస్ విమర్శించారు.
బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ బురదను కాంగ్రెస్కు అంటించే ప్రయత్నాలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు. “గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తీ” అన్నట్లు బీఆర్ఎస్, బీజేపీల మధ్య సన్నిహిత సంబంధం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని, బీఆర్ఎస్లో మాత్రం నియంతృత్వ పోకడలు ఎక్కువగా కనిపిస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.