వేములవాడ, వెలుగు: ప్రజా సమస్యలను పరిష్కరించి, అధికారులు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. గురువారం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో వేములవాడ మున్సిపల్ ఆఫీసులో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కింద సీఎం రేవంత్రెడ్డి వేములవాడ వచ్చి ప్రారంభించిన అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వేములవాడ ఆలయ విస్తరణ, రోడ్డు విస్తరణ పనులు, ఇందిరమ్మ ఇళ్లు.. తదితర పనులు స్పీడ్గా నడుస్తున్నాయన్నారు. మూలవాగు బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ కోసం రూ.6.90 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఇసుక సమస్యలు ఉంటే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇన్చార్జి కలెక్టర్గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం స్థలాలను వెంటనే గుర్తించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో రాధాబాయ్, డీఆర్డీవో శేషాద్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భీమేశ్వర ఆలయంలో సీసీ కెమెరాలు
వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలు, 15 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 5 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను విప్ ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. అంతకుముందు స్వామివారిని ఆయన దర్శించుకున్నారు.
