యూఎన్: డెల్టా కరోనా మరింత డేంజర్గా మారుతోందని, అందులో మార్పులు జరుగుతూనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచమంతా ఇప్పుడు అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కరోనా కేసులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయన్నారు. శనివారం డబ్ల్యూహెచ్వోలో టెడ్రోస్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏ దేశమూ కరోనా ఆపద నుంచి బయటపడలేదని చెప్పారు. డెల్టాలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉండాలని, దానికి తగ్గట్టు ఆరోగ్య రంగాన్ని బలపరచుకోవాలని సూచించారు. మాస్కులు పెట్టుకోవడం, దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూనే.. మహమ్మారి కట్టడికి అవసరమైన టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, ఆసుపత్రుల్లో సౌలతులు మెరుగుపరుచుకోవడం వంటి చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు.