టీఎస్​పీఎస్సీకి కొత్తబాస్ ఎవరు?.. రేసులో ఐపీఎస్​..!

టీఎస్​పీఎస్సీకి కొత్తబాస్ ఎవరు?..  రేసులో ఐపీఎస్​..!
  • ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్
  • చైర్మన్ రేసులో ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు ఐపీఎస్​లు 
  • దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునే చాన్స్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్​పీఎస్సీ)ప్రక్షాళనపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. అందులో  భాగంగా కొత్త టీమ్​ను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా..కమిషన్ చైర్మన్ గా ఇద్దరు ఐపీఎస్​లతో పాటు, ఇద్దరు ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్​పీఎస్సీ మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

బీఆర్ఎస్ హాయంలో నియమితులైన టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు మరో నలుగురు సభ్యులు ఇటీవల రాజీనామా చేశారు. దీంతో కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానించింది. గురువారం సాయంత్రంతో గడువు ముగిసింది. అప్లికేషన్లు భారీగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. సుమారు 200 వరకూ అప్లికేషన్లు వచ్చాయని సమాచారం.

భర్తీకి మరికొంత ఆలస్యం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు జేఎన్టీయూ, కాకతీయ వర్సిటీల ప్రొఫెసర్లు చైర్మన్, మెంబర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పాటు కొందరు ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ప్రొఫెసర్లు, ఎన్జీవో ప్రతినిధులూ  అప్లై చేసుకున్నారు.  ప్రస్తుతం కొనసాగుతున్న మెంబర్ అరుణకుమారిని కూడా త్వరలో రిజైన్ చేయించే అవకాశముంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో చైర్మన్ సహా, పది మెంబర్ పోస్టులను భర్తీ చేసే చాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు.  వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసేందుకు సర్కారు ఓ కమిటీని నియమించే అవకాశం ఉంది. ఆ  కమిటీ వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి, డ్రాప్ట్ చేసి సర్కారుకు ప్రతిపాదించనుంది. టీఎస్​పీఎస్సీలో  సగం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో తప్పనిసరిగా  పనిచేసి ఉండాలనే నిబంధన ఉంది. దీంతో  కొందరు సర్కారు సీనియర్ ఎంప్లాయీస్​ ను కూడా మెంబర్లుగా పెట్టే అవకాశముంది. 

చైర్మన్ రేసులో ఐపీఎస్​..!

టీఎస్​పీఎస్సీపై నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేలా కొత్త చైర్మన్​ను నియమించాలని సర్కారు భావిస్తోంది. దానికోసం సరైన వ్యక్తిని నియమించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా గతేడాది రిటైర్డ్ అయిన ఓ సీనియర్ ఐపీఎస్​ ఆఫీసర్ పేరుతో పాటు ప్రస్తుతం సర్వీస్​లో ఉన్న సీనియర్ ఐపీఎస్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  రిటైర్డ్ అయిన ఐపీఎస్ సర్వీస్​ను ఏడాది పాటు పొడిగించి వినియోగించుకోవాలనే యోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం. మరోపక్క ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న హెచ్​సీయూ ప్రొఫెసర్ పేరు కూడా వినిపిస్తోంది. జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్, ఓయూ సీనియర్ ప్రొఫెసర్ పేర్లూ పరిశీలనలో ఉన్నాయి.