న్యూఢిల్లీ: హోల్సేల్ ధరల పెరుగుదలను కొలిచే హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ (డబ్ల్యూపీఐ) ఈ ఏడాది మార్చిలో 3.88 శాతానికి చేరి మూడేళ్ల గరిష్టాన్ని తాకింది. డబ్ల్యూపీఐ వరుసగా ఐదో నెలలోనూ పెరిగింది. ఇరాన్–అమెరికా యుద్ధం వల్ల ఇంధనం, విద్యుత్, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణం. డబ్ల్యూపీఐ ఫిబ్రవరిలో 2.13శాతంగా, గత సంవత్సరం మార్చిలో 2.25శాతంగా నమోదైంది.
ఈ ఏడాది మార్చిలో క్రూడ్ పెట్రోలియం ధరలు ఫిబ్రవరి(మైనస్ 1.29 శాతం) తో పోలిస్తే 51.57శాతం పెరిగాయి. ఫ్యూయల్ అండ్ పవర్ బాస్కెట్ ధరలు డిఫ్లేషన్ (మైనస్ 3.78 శాతం) నుంచి 1.05 శాతానికి పెరిగాయి. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలోని 2.92 శాతం నుంచి 3.39శాతానికి చేరింది. ఫారిన్ బ్యాంక్ బార్క్లేస్ ప్రకారం, ఇది ఆగస్టు 2023 తర్వాత అత్యంత వేగవంతమైన పెరుగుదల. ఆహార పదార్ధాల ధరలు మాత్రం కొంత తగ్గాయి.

