విశ్లేషణ: ధనిక రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలకు లేట్​ ఎందుకు?

విశ్లేషణ: ధనిక రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలకు లేట్​ ఎందుకు?

కేసీఆర్ 1.0 కంటే 2.0లో రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. కార్పొరేట్​ కొలువుల్లో ఉన్నోళ్లకి నెల తిరిగే లోపే వాళ్ల అకౌంట్లలో జీతం డబ్బులు పడిపోతాయి. కానీ కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు  మాత్రం టైమ్​కు జీతం రావడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.  చిట్టీలు, ఈఎంఐలు ఇతర ఖర్చుల కోసం అప్పులు చేయక తప్పడం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ‘కూర్చుండి మాట్లాడుకుందాం! సమస్యలు పరిష్కరించుకుందాం’ అని చెప్పిన సీఎం సారు... ఇప్పటి వరకు కూర్చున్నదీ లేదు.. సమస్యలు పరిష్కరించిందీ లేదు. ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా కొత్తవి సృష్టిస్తున్నారు. పెండింగ్​లో ఉన్న బిల్లులన్నీ మురిగిపోతున్నాయి. నిరుడు కూడా ఇలాగే వేలాది బిల్స్ మురిగిపోయాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.  

పెండింగ్​ బిల్లులు ఎన్నో!
కూతురు పెండ్లికి జీపీఎఫ్ అడ్వాన్స్​/పాక్షిక విత్ డ్రాయల్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే మనుమరాలు బారసాలకు కూడా డబ్బు చేతికి వస్తుందో రాదో తెలియని దుస్థితి దాపురించింది. ఏండ్ల తరబడి కూడబెట్టుకున్న జీపీఎఫ్ డబ్బులపై అనుచిత కంట్రోల్ ఎందుకో అర్థం కాదు. పెండింగ్​లో ఉన్న బిల్లుల మంజూరులో అధికారులు పారదర్శకత పాటించడం లేదు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వుడ్ విధానం అమలు చేయకపోవడం గవర్నెన్స్ కు ఓ మచ్చే.  నాలుగు దశాబ్దాలుగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతీ నెలా ఒకటో తేదీన ఠంచన్‌‌ గా జీతాలు, పెన్షన్ అందుకుంటూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న 90వ దశకంలో కూడా ఒకటో తేదీనాడే వేతనాలు చెల్లించారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న బంగారు తెలంగాణలో ఒకటో తేదీనాడు ఏ నెలలోనూ జీతాలు రావడం లేదు. ఒక్కో రోజు కొన్ని జిల్లాల చొప్పున వంతుల వారీగా జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నారు. మొదటి వారంలోగా జీతాలు వస్తే సంతోషపడే స్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారు. 317 జీవో ద్వారా బదిలీ అయిన చాలా మంది టీచర్లకు, ఇతర స్టాఫ్​కు జనవరి నెల వేతనం కూడా నేటికీ రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వేతనాలు మినహా మిగతా కొన్ని రకాల బిల్లులు మంజూరు చేయకుండా ఫ్రీజింగ్ పెట్టేవారు. దీని గురించి ముందే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసేవారు. ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో అధికారికంగా ఎప్పుడూ ఫ్రీజింగ్ ప్రకటించలేదు. కానీ, బిల్స్ మాత్రం మంజూరు కావడం లేదు. సంపాదిత సెలవుల నగదు, మెడికల్ రీయింబర్స్​మెంట్, పిల్లల ఫీజు రాయితీ, జీపీఎఫ్ అడ్వాన్సులు, పాక్షిక విత్ డ్రాయల్ తదితర బిల్లులు ఆరు నెలలు దాటినా శాంక్షన్ కావడంలేదు. ఈ–కుబేర్ లో పెండింగులో పెడుతున్నారు. ఈ నెల 31లోగా బిల్స్ క్లియర్ కావాలి. లేనిపక్షంలో మురిగిపోతాయి.  అయితే, కొంత మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల బిల్లులు మాత్రం వెంటవెంటనే మంజూరవుతున్నాయి.  ఉద్యోగి రిటైరయ్యే రోజే రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే పలుసార్లు ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది.  రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. 

పనిచేయని హెల్త్ కార్డ్స్ ఎందుకు?
 నగదు రహిత వైద్యం అందించేందుకు జారీ చేసిన హెల్త్ కార్డ్స్ ఎందుకూ పనికి రాకుండాపోయాయి. హెల్త్ కార్డ్స్ పై వైద్యం చేయడానికి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ నిరాకరిస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ప్రతినెలా తమ వంతు వాటాగా కొంత మొత్తం చందా చెల్లించడానికి సుముఖంగా ఉన్నారని సంఘాలు రాత పూర్వకంగా తెలిపినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. హెల్త్ కార్డ్స్ విధానాన్ని పటిష్ట పర్చడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పోనీ మెడికల్ రీయింబర్స్​మెంట్ పరిమితి పెంచారా అంటే, అదీ లేదు. ఎప్పుడో 2005 లో నిర్ధారించిన రెండు లక్షల రూపాయల గరిష్ఠ పరిమితే నేటికీ అమల్లో ఉంది. పైగా, కరోనా ట్రీట్​మెంట్​కి రీయింబర్స్​మెంట్ లిమిట్ ఒక లక్ష రూపాయలకు తగ్గించి, ఆర్థిక సమస్యలు పెంచారు. 

బదిలీలు, ప్రమోషన్లు లేనే లేవు..
ఉమ్మడి రాష్ట్రంలో ఏటా బదిలీలు జరిగేవి. స్వ రాష్ట్రంలో మాత్రం ఈ ఎనిమిదేండ్లలో ఉద్యోగులకు ఏడేండ్లు, టీచర్లకు ఆరేండ్లుగా బదిలీలే లేవు. దీర్ఘకాలంగా బదిలీలు చేయకపోవడంతో దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, స్పౌజ్ కేటగిరీ ఉద్యోగ, ఉపాధ్యాయులు అనుభవిస్తున్న బాధలు ఇన్నీ అన్నీ కావు. 317 జీవోతో ఈ సమస్య ఇంకా ఎక్కువైంది. అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ఏడేండ్లుగా రాష్ట్రంలో టీచర్లకు ప్రమోషన్లే ఇవ్వలేదు. దీంతో, అన్ని అర్హతలున్నా ప్రమోషన్​కి నోచుకోకుండానే వందలాది మంది టీచర్లు ప్రతి నెలా రిటైర్ అవుతూనే ఉన్నారు. విద్యాశాఖలో పదోన్నతుల విషయాన్ని కేవలం టీచర్ల సమస్యగానే ప్రభుత్వం చూస్తోంది. పండిట్, పీఈటీ పోస్టులను అప్​గ్రేడేషన్ చేస్తూ జీవో జారీ చేశారు. కానీ అమలు చేయడం మరిచారు. ఆ పోస్టులను ఇంతవరకు కనీసం స్కూళ్లకు కూడా కేటాయించలేదు. 23 కొత్త జిల్లాలకు డీఈవో పోస్టులు, 47 కొత్త మండలాలకు ఎంఈవో పోస్టులే మంజూరు చేయలేదు. సర్వీస్ లో ఉండి మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి పది రోజుల్లో కారుణ్య నియామకం చేయాలని సీఎం చెప్పి ఏండ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. మాటల్లో ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ సర్కారు అని చెప్తూనే ఆచరణలో దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సమస్యలను సీఎం దృష్టికి తీసుకొనిపోవడానికి  సంఘాలకు కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదు. గత ఆరేండ్లుగా సీఎం ఉపాధ్యాయ ప్రతినిధులకు అపాయింట్​మెంట్ కూడా ఇవ్వడం లేదు. సీఎం తమ పట్ల అనుసరిస్తున్న వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి.

సీపీఎస్​తో అభద్రతాభావం
2004 సెప్టెంబర్ తర్వాత ప్రభుత్వ కొలువుల్లో చేరిన వాళ్లు సీపీఎస్ కారణంగా పూర్తి అభద్రతాభావంతో ఉన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్​ విధానాన్ని అమలు చేయాలని మొరబెట్టుకున్నా సీఎం కనికరం చూపడం లేదు. రాజస్థాన్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీంను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగవర్గాలు కోరుతున్నాయి.  
- మానేటి ప్రతాప రెడ్డి, టీఆర్​టీఎఫ్ గౌరవాధ్యక్షుడు