మొన్నటివరకు చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాలు బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగాయి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. భవిష్యత్తులో రేర్ ఎర్త్ ఎలిమెంట్సే దేశాలకు ఆస్తులుగా మారనున్నాయి. ప్రపంచం క్లీన్ ఎనర్జీ వైపు పరుగెత్తుతుండడం, చాలా దేశాలు రక్షణ రంగాలను బలోపేతం చేసుకుంటుండడం, టెక్నాలజీ డెవలప్మెంట్తో స్మార్ట్ గాడ్జెట్ల వాడకం పెరగడం వల్ల ప్రస్తుతం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రపంచానికి మరో ఇంధనంగా మారిపోయాయి. ఇంతకీ వాటితో ఏం చేస్తారు? వాటిని ఎలా తయారుచేస్తారు?
ఈ మధ్య చైనా రేర్ ఎర్త్ మెటల్స్ లేదా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్(ఆర్ఈఈ) ఎగుమతులపై కఠినమైన ఆంక్షలను విధించింది. దాంతో అమెరికా ఉక్కిరిబిక్కిరైపోతోంది. అసలు వాటితో అమెరికాకు పనేంటి? అంటారా... అమెరికాకే కాదు భవిష్యత్తులో అన్ని దేశాల అభివృద్ధికి అవే కీలకంగా మారనున్నాయి. చమురు, బంగారం లాంటి వాటిపై ఏ దేశమైనా ఆంక్షలు విధిస్తే.. మరో దేశం నుంచి కొనుక్కోవచ్చు. కానీ.. చైనా నుంచి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులు నిలిచిపోతే కొన్ని దేశాల్లో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వస్తుంది.
ఎందుకంటే.. ఈవీల మోటార్ల నుంచి విండ్ టర్బైన్ల తయారీలో కూడా ఇవే కీలకం. అంతెందుకు ఎఫ్–-35 ఫైటర్ జెట్లు, టోమాహాక్ క్షిపణులతోపాటు అమెరికా తయారుచేసే అనేక ఆయుధ వ్యవస్థల్లోని ప్రధాన భాగాల్లో వీటిని వాడతారు.
విరివిగా దొరికేవే!
పీరియాడిక్ టేబుల్లోని 17 అరుదైన మూలకాల సమూహాన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని పిలుస్తుంటారు. అవే స్కాండియం, యట్రియం, లాంతనమ్, సిరియం, ప్రాసియోడైమియం, నియోడైమియం, ప్రోమెథియం, సమారియం, యూరోపియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, హోల్మియం, ఎర్బియం, థులియం, ఇట్టర్బియం, లుటెట్టియం. పేరులో ‘రేర్’ ఉన్నా వీటిలో చాలా మూలకాలు భూమిలో ఎక్కడైనా దొరుకుతాయి. కానీ.. ముడి ఖనిజం నుంచి ఈజీగా వేరు చేయగలిగేంత ఎక్కువ సాంద్రత కలిగిన గనులు చాలా అరుదుగా ఉంటాయి. కొన్ని ఎలిమెంట్స్ మాత్రం భూమిలో సీసం, రాగి కంటే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.
కానీ.. వాటిలా ఒకే చోట నిక్షేపాలుగా దొరకవు. భూమి పొరల్లో చాలా తక్కువ పరిమాణంలో సన్నగా వ్యాపించి ఉంటాయి. లేదంటే ఇతర ఖనిజాలతో కలిసిపోయి ఉంటాయి. కాబట్టి, వాటిని వెలికితీసి, వేరుచేసి శుద్ధి చేసే ప్రక్రియలు చాలా ఖరీదైనవి. ఇవి ప్రధానంగా బాస్ట్నాసైట్, మోనాజైట్ లాంటి ఖనిజాల్లో నిక్షిప్తమై ఉంటాయి. వీటన్నింటి రసాయన ధర్మాలు ఒకేలా ఉండటం వల్ల ఖనిజాల్లో కూడా దాదాపు అన్నీ కలిసే ఉంటాయి. అందుకే 1907 వరకు వాటన్నింటినీ ఒకే మూలకంగా భావించేవాళ్లు.
మొదటి స్థానంలో చైనా
చాలా దేశాల్లో బాస్ట్నాసైట్, మోనాజైట్ గనులు ఉన్నప్పటికీ ఉత్పత్తి విషయంలో మాత్రం చైనా మొదటి స్థానంలో ఉంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 3లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తి జరిగింది. అందులో చైనా వాటా 2 లక్షల70 వేల టన్నులు. అంటే దాదాపు 69 శాతంతో మొదటిస్థానంలో నిలిచింది. అమెరికా కేవలం 45 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. ఆ తర్వాతి స్థానాల్లో మయన్మార్, ఆస్ట్రేలియా, థాయ్లాండ్, ఇండియా (2,900 టన్నులు) ఉన్నాయి. చైనా ముందుచూపు వల్లే ఇప్పుడు ప్రొడక్షన్లో ముందుంది. ఆ దేశం 1990ల్లోనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇంపార్టెన్స్ని గుర్తించింది.
క్రమంగా అక్కడ అధునాతన పరిశ్రమలను నెలకొల్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయగలిగేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకున్నారు. పైగా చైనాలో పరిశ్రమలపై నిబంధనలు తక్కువగా ఉండటం వల్ల ప్రొడక్షన్ క్రమంగా పెరిగింది. దాంతో ఏకంగా ప్రపంచ మార్కెట్నే ఆక్రమించుకుంది. ప్రపంచం వినియోగిస్తున్న మొత్తం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో చైనా 70 శాతం మైనింగ్, 90 శాతం ప్రాసెసింగ్ చేస్తోంది. అంతేకాదు.. ఈవీలు, మోటార్లు, డిఫెన్స్ రంగంలో వాడే మ్యాగ్నెట్స్ని 92–93 శాతం, హీట్-రెసిస్టెంట్ మ్యాగ్నెట్స్ తయారీలో ఉపయోగపడే హెవీ రేర్ ఎర్త్లు అంటే డిస్ప్రోసియం, టెర్బియం లాంటి వాటిని 99 శాతం వరకు చైనానే ఉత్పత్తి చేస్తోంది.
నిల్వల్లోనూ చైనానే టాప్
ఒక అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వలు ఉన్నాయి. అందులో 44 మిలియన్ టన్నుల (40 శాతం)తో చైనా మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, ఇండియా, ఆస్ట్రేలియా, రష్యా, వియత్నాం, యుఎస్ ఉన్నాయి.
ఫుల్ డిమాండ్
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి ఇప్పటికే చాలా డిమాండ్ ఉంది. ఈ ఎలిమెంట్స్ లేకుంటే సాంకేతిక అభివృద్ధి సాధ్యం కాదు అంటున్నారు ఎక్స్పర్ట్స్. 2023లో మ్యాగ్నెట్లకు 45 శాతం, బ్యాటరీలకు 10 శాతం డిమాండ్ పెరిగింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అప్పుడు వీటి డిమాండ్ 2 లక్షల టన్నుల వరకు పెరుగుతుందని అంచనా. గ్లోబల్ వార్మింగ్ను ఎదుర్కోవడానికి చాలా దేశాలు క్లీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల కూడా డిమాండ్ పెరుగుతోంది.
భవిష్యత్తు సవాళ్లు
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గనుల తవ్వకం, వాటి రిఫైనింగ్ పర్యావరణానికి చాలా హానికరం. వాటిని ప్రాసెస్ చేసే ప్రక్రియల్లో ద్రావకాలను వాడుతుంటారు. అవి నేల, నీరు, వాతావరణాన్ని కలుషితం చేసే విషపూరిత వ్యర్థాలను విడుదల చేస్తాయి. అందుకే సైంటిస్ట్లు ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. కానీ.. అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో కొద్ది మొత్తంలో రేడియోయాక్టివ్ థోరియం, యురేనియం కూడా ఉంటాయి. అందుకే కొన్ని దేశాల్లో గనులు ఉన్నప్పటికీ తవ్వకాలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు రీసైక్లింగ్, సబ్స్టిట్యూట్ మెటీరియల్స్పై సైంటిస్ట్లు రీసెర్చ్లు చేస్తున్నారు.
ఎన్నో ఉపయోగాలు
స్మార్ట్ గాడ్జెట్స్: మనం నిత్యం వాడే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, కెమెరాలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఉదాహరణకు.. లాంథనం, సిరీయంని కెమెరా లెన్స్లు, హార్డ్ డ్రైవ్లు, ఎల్సీడీ/ఎల్ఈడీ స్క్రీన్లు, బ్యాటరీల తయారీలో వాడతారు.
గ్రీన్ ఎనర్జీ: రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కొన్ని మూలకాలతో కలిస్తే శక్తిమంతమైన అయస్కాంతాలుగా మారతాయి. వాటిని ఎలక్ట్రిక్ మోటార్లు, కార్లలోని పవర్ విండోలు, విండ్ టర్బైన్లు, హెడ్ఫోన్లు, స్పీకర్లపాటు మరికొన్ని ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్లో వాడతారు.
డిఫెన్స్, ఏరోస్పేస్: డిఫెన్స్ రంగంలో కూడా ఇవి ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. జెట్ ఇంజన్లు, గైడెడ్ మిస్సైల్స్, రాడార్లలో వాడే లైట్వెయిట్ అల్లాయ్లు, లేజర్ టెక్నాలజీ, డ్రోన్లలో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. యట్రియం, టెర్బియం లాంటి ఎలిమెంట్స్ లేజర్ గైడెన్స్ సిస్టమ్స్లో వాడుతున్నారు.
మెడికల్ టెక్నాలజీ: ఎంఆర్ఐ స్కానర్లు, ఎక్స్-రే మెషీన్లు, ఇతర డయాగ్నస్టిక్ పరికరాల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు.. ఎంఆర్ఐ స్కాన్లలో కాంట్రాస్ట్ ఏజెంట్గా గాడోలినియంని వాడుతున్నారు.
ఇతర పరిశ్రమలు : వీటిని ఆటోమొబైల్స్, గ్లాస్ పాలిషింగ్, ఫైబర్ ఆప్టిక్స్, ఫర్టిలైజర్లు, ఎల్ఈడీ లైటింగ్లో కూడా వాడుతున్నారు. ఉదాహరణకు.. గ్లాస్, స్టీల్ పరిశ్రమల్లో సిరీయంని ఎక్కువగా వాడుతుంటారు.
మన దేశంలో..
ఈ రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు మన దేశం కూడా సొంతంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కానీ.. చైనాతో పోటీపడాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. చైనా ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ తర్వాత మన దేశం పనులు వేగవంతం చేసింది. ప్రపంచంలోని మొత్తం రేర్ ఎర్త్ నిల్వల్లో మన దేశంలో సుమారు 6 శాతం(6.9 మిలియన్ టన్నులు) ఉన్నాయి. కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ నిక్షేపాలు ఉన్నాయి. కానీ.. ప్రస్తుతం గ్లోబల్ ప్రొడక్షన్లో ఇండియా వాటా ఒక శాతం కంటే తక్కువే ఉంది. ప్రొడక్షన్ పెంచేందుకు గవర్నమెంట్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్-2025 ను ప్రారంభించింది.
