తాగి హింసిస్తున్నారని భర్తలను చంపిన భార్యలు

తాగి హింసిస్తున్నారని భర్తలను చంపిన భార్యలు

తూప్రాన్/చెన్నూరు, వెలుగు : మద్యం తాగి హింసిస్తున్నారని ఇద్దరు భర్తలను వారి భార్యలు చంపేశారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. మెదక్ జిల్లా తూప్రాన్  మండలంలో ఘన్ పూర్  గ్రామానికి చెందిన నర్సయ్య, అనంతమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. వారిలో  పెద్ద కొడుకు  వెంకటేశ్ (36) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నర్సయ్య, అనంతమ్మ చిన్న కొడుకుతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు. వెంకటేశ్  తాగుడుకు బానిసై తన భార్య, పిల్లలను వేధిస్తున్నాడు.

 దీంతో విసుగు చెందిన భార్య శుక్రవారం తన బంధువులతో కలిసి వెంకటేశ్  ను ఒక పాత ఇంట్లో కాళ్లుచేతులు కట్టేసి శరీరంపై యాసిడ్  పోసి చిత్రహింసలు పెట్టింది. వెంకటేశ్  కనిపించకపోవడంతో స్థానికులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామానికి వచ్చిన అతని పేరెంట్స్ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లిచూడగా వెంకటేశ్  బందీ అయి కనిపించాడు. దీంతో వెంటనే అతడిని శనివారం హస్పిటల్ కు తరలించారు. అప్పటికే వెంకటేశ్  మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వెంకటేశ్  పేరెంట్స్  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

చెన్నూరులో కూడా..

మంచిర్యాల జిల్లా చెన్నూరులో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. చెన్నూరు మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన మడక తిరుపతి (34) కి చెన్నూరు పట్టణం కొత్తగూడెం కాలనీకి చెందిన సౌందర్యతో అతనికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం తన భార్య, ఇద్దరు పిల్లలతో అతను అత్తగారి ఇంట్లో ఉంటున్నాడు. స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా అతను మద్యానికి బానిసై రోజూ భార్యతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి గొడవ పడ్డాడు. దీంతో విసుగు చెందిన భార్య సౌందర్య తన తల్లి లక్ష్మితో కలిసి శనివారం తెల్లవారుజామున తిరుపతిని రోకలిబండతో కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.