వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

జోగిపేట, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది ఓ భార్య. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పీఎస్​ పరిధిలో జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం డీఎస్పీ రమేశ్  మీడియాకు వెల్లడించారు. జోగిపేటకు చెందిన మల్లేశంకు (30) మండల పరిధిలోని మన్​సాన్​పల్లికి చెందిన మేనమామ కూతురు కల్పనతో 2015 లో వివాహమైంది. దీనికి ముందే అదే గ్రామానికి చెందిన మచుకూరి మహేశ్, కల్పన ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య కొన్నాళ్లు వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ విషయం ఇటీవల భర్త ఇంట్లో తెలియడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ విషయాన్ని కల్పన మచుకూరి మహేశ్​కు చెప్పింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు. మహేశ్ ఈ విషయాన్ని  రంగంపేటకు చెందిన తన మేనబావ అంబాజీకి చెప్పాడు. దీంతో తనకు పరిచయం ఉన్న తలారి  మహేశ్​(రంగంపేట), వజ్జెరి మహేశ్ ను​అంబాజీ మచుకూరి మహేశ్ కు పరిచయం చేశాడు. మల్లేశంను చంపడానికి రూ.50 వేలకు సుపారీ మాట్లాడి రూ.5 వేలు అడ్వాన్స్​ ఇచ్చారు. ఈనెల 18న మచుకూరి మహేశ్   తన స్నేహితుడి కారును అద్దెకు తీసుకున్నాడు. తలారి మహేశ్, వజ్జెరి మహేశ్ తో కలిసి ఆ కారులో జోగిపేటకు వచ్చి ఇండియన్​ పెట్రోల్​ బంక్​లో రాత్రి బసచేశారు.

ఉదయం 4.30 గంటలకు  మల్లేశం ఇంటి సమీపంలో కాపుకాశారు. కల్పన మహేశ్​కు ఫోన్​ చేసి తన భర్త బయటకు వస్తున్నాడని చెప్పడంతో వారందరు దారికాచి మల్లేశం వచ్చిన వెంటనే రాయితో ఆయన తలపై మోదారు. స్పృహ కోల్పోయిన వెంటనే కారులోకి ఎక్కించుకుని కొట్టడంతో మల్లేశం చనిపోయాడు. తర్వాత మెదక్  జిల్లా రామాయంపేట వైపు వెళ్లి ఎవరూలేని ప్రాంతంలో ఓ చెరువు వద్ద ఆగారు. పెట్రోల్​ పోసి శవాన్ని తగులబెట్టారు. మల్లేశం హత్యకు పాల్పడిన మచుకూరి మహేశ్​, భార్య కల్పన, తలారి మహేశ్​, వజ్జెర మహేశ్​తో  పాటు వారికి సహకరించిన అంబాజీపై కేసు నమోదు చేశారు.