ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఎప్పుడైనా తనను కలవొచ్చునని.. సమస్యలను తన దృష్టికి తీసుకురావొచ్చునని రేవంత్ తెలిపారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు.. కేసీఆర్, కేటీఆర్ కూడా ప్రజా సమస్యలపై నన్ను కలవొచ్చు. నేను అందుబాటులో లేకుంటే డిప్యూటీ సీఎం భట్టిని కలవొచ్చు. ప్రజా సమస్యల పరిష్కారానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం” అని చెప్పారు. ‘‘పులి (కేసీఆర్) బయటకు వస్తుందని, ఆయన వస్తే ఏదో జరుగుతుందన్నట్టు బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారు. కానీ అదేం జరగదు. ఆయన బయటకొస్తే బోనులో వేయడానికి ప్రజలు, యువత సిద్ధంగా ఉన్నారు” అని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్పై శ్వేతపత్రం..
తామిచ్చిన హామీల అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని రేవంత్ తెలిపారు. ఇరిగేషన్ శాఖపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ‘‘ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీ కోసం సిట్టింగ్ జడ్జీలను కేటాయించాలని చీఫ్ జస్టిస్కు లేఖ రాశాం. ఈ శాఖలో అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే మొదలైంది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చట్ట ప్రకారం విచారణ మొదలుపెట్టాం” అని పేర్కొన్నారు. ‘‘రాజకీయాలను దేవుడితో ముడిపెట్టొద్దు. భద్రాచలంలో రాముడు ఉన్నడు.. భక్తులందరూ వచ్చి దర్శించుకోండి. దేవునికి, రాజకీయానికి సంబంధం లేదు. ఎవరికి వీలైనప్పుడు వెళ్లి వాళ్లు దర్శనం చేసుకుంటారు” అని అన్నారు.