సీఎం ఎంట్రీతో సీన్​ మారేనా?

సీఎం ఎంట్రీతో సీన్​ మారేనా?
  • గ్రాడ్యుయేట్స్, సాగర్​ ఎన్నికల కోసం స్వయంగా రంగంలోకి కేసీఆర్
  • ఈ నెల 10న హాలియాలో కేసీఆర్​ బహిరంగ సభ
  • ఏర్పాట్లలో టీఆర్​ఎస్​ లీడర్లు
  • ఉమ్మడి జిల్లాలో  2 లక్షల మంది జనసమీకరణకు ఏర్పాట్లు

నల్గొండ, వెలుగు : దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎలక్షన్స్​లో బీజేపీ దూకుడు.., కృష్ణా నదిపై ఏపీ కడుతున్న సంగమేశ్వరం ప్రాజెక్టుతో  దక్షిణ తెలంగాణ మున్ముందు ఎడారయ్యే ప్రమాదముందనే ప్రచారం,​ ప్రభుత్వం పట్ల ఉద్యోగులు, నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత.. ఇలా ఏరకంగా చూసినా రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, సాగర్ బై ఎలక్షన్స్​లో టీఆర్​ఎస్​ గెలుపు అంత ఈజీ కాదని రూలింగ్​ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే పరిస్థితిని ఎంతో కొంత చక్కదిద్దేందుకు స్వయంగా సీఎం కేసీఆర్​ రంగంలోకి దిగడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే సాగర్​ నియోజకవర్గంలోని పాత హామీల అమలుకు వరుస జీవోలు ఇచ్చిన సర్కార్ తాజాగా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఉత్తర్వులు జారీచేసింది. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని ఐదు నియోజకవర్గాలకు కలిసొచ్చేలా సుమారు రూ.3 వేల కోట్ల విలువజేసే లిఫ్టు స్కీములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ 2018 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే అయినప్పటికీ సాగర్ బైపోల్ నేపథ్యం లో మోక్షం లభించింది. ఐదు నియోజవర్గాల్లో నిర్మించబోయే ప్రాజెక్టులకు నెల్లికల్లు వద్ద ఈ నెల 10న శంకుస్థాపన చేసేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ రానుండడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

దుబ్బాక ఫలితం రిపీట్​ కావద్దనే..

దుబ్బాక బైపోల్ జరిగినప్పుడు అటువైపు కనీసం కన్నెత్తి చూడని సీఎం ఇప్పుడు సాగర్ కి రాబోతుండడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. దుబ్బాక ఎన్నికల బాధ్యతను పార్టీ ట్రబుల్​ షూటర్​ మంత్రి హరీశ్​కు అప్పగించినప్పటికీ ఆ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ గెలవడం టీఆర్ఎస్​కు మింగుడు పడలేదు. ఆ తర్వాత జరిగిన జీ హెచ్ఎంసీ ఎన్నికలను సైతం మరో కీలక నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​కు అప్పగించి నా ఆశించిన ప్రయోజనం దక్కలేదు. 100 సీట్లకు పైగా గెలుచుకుంటామని చెప్పిన టీఆర్​ఎస్​55 సీట్ల వద్దే చతికిల పడింది. ఈ ఎన్నికల రిజల్ట్స్​తో టీఆర్ఎస్ నాయకత్వం గందరగోళంలో పడింది. ఇదే రకమైన పరిస్థితి సాగర్​లో రిపీట్ కాకుండా ఉండేందుకే కేసీఆర్ ఎంట్రీ ఇవ్వక తప్పడం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ పార్టీ పరంగా టీఆర్ఎస్ బలంగానే ఉందని ఇటీవల హైకమాండ్ జరిపిన వేర్వేరు సర్వేల్లో తేలింది. కానీ అభ్యర్థి విషయానికి వచ్చేసరికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పైగా ఎమ్మెల్యే నర్సింహయ్య మరణించాక  నియోజ కవర్గంలో గ్రూప్ పాలిటిక్స్ మరింత ముదిరాయి. ఓ వైపు మంత్రి జగదీశ్​ రెడ్డి వర్గం, మరోవైపు నోముల భగత్ వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.

ఇరిగేషన్ స్కీంల పైనే ఫోకస్…

శ్రీశైలం బ్యాక్​వాటర్​లో కృష్ణాపై పోతిరెడ్డిపాడుకు తోడు సంగమేశ్వరం ప్రాజెక్టును ఏపీ సర్కారు జెట్​ స్పీడ్​తో నిర్మిస్తోంది. దీనిని రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదని, ఈ ప్రభావం నాగార్జునసాగర్ ఆయకట్టు పై పడుతుందని ప్రతిపక్షాలు కొంతకాలంగా ఆరోపిస్తున్నా యి. ఏపీ ప్రాజెక్టుల వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదముందనే ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికలపై ఈ ప్రభావం పడే అవకాశముండడంతో సీఎం కేసీఆర్ తెలివిగా నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధి లోని ఐదు నియోజకవర్గాలకు కలిసొచ్చేలా సుమారు రూ.3 వేల కోట్ల విలువజేసే లిఫ్టు స్కీములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాగర్ టెయిల్ పాండ్, పులిచింత బాక్ వాటర్​లో నిల్వ ఉండే నీటితోనే ఇప్పుడు మంజూరైన లిఫ్టు స్కీములు నడుస్తాయని పార్టీ లీడర్లు చెప్తున్నారు. మరోవైపు గోదావరి నదిలో వృథాగా పోతున్న జలాలను కృష్ణాకు అనుసంధానించే ప్రపోజల్​ గురించి సీఎం, జిల్లా ఎమ్మెల్యే లు, ముఖ్య నేతలతో ఇటీవల చర్చించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు తుది దశకు చేరుకున్నందున ఇప్పుడు దక్షిణ తెలంగాణలోని నల్గొండ, మహబూబ్​నగర్​ జిల్లాల పైనే కేసీఆర్ ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది.

భారీ సభకు ఏర్పాట్లు..

సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో కేసీఆర్ సభ భారీగా నిర్వహించేందుకు టీఆర్​ఎస్​ లీడర్లు ప్లాన్​ చేశారు. జిల్లా మంత్రి జగదీశ్​ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గడిచిన రెండు రోజులుగా సభ ఏర్పా ట్లను పరిశీలిస్తున్నారు. కేసీఆర్ సభ స్టేజీ ఇన్​చార్జిలుగా హైకమాండ్​ కార్పొరేషన్​ చైర్మన్లు బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్​రా వుకు  బాధ్యతలు అప్పగించింది. కేసీఆర్ పర్యటనలో భాగంగా ఈ నెల 10 తేదీన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్​లో బయల్దేరి నేరుగా నెల్లికల్లుకు చేరుకొని అక్కడే ఐదు లిఫ్టు స్కీములకు ఒకే శిలాఫలకానికి శంకుస్థాపన చేస్తారు. అటు నుంచి హాలియాలో 14 మైలురాయి వద్ద మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారు వంద ఎకరా ల్లో సభ ఏ ర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి రెండు లక్షల మందిని తరలించేందుకు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండు ఎన్నికలూ పరీక్షే…

ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనికంటే ముందుగానే ఈ నెల 10న సీఎం కేసీఆర్ బహిరంగ సభ హాలియాలో తలపెట్టారు. వచ్చే నెలాఖరులో జరిగే వరంగల్​, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే బైపోల్స్​.. రూలింగ్ పార్టీకి కత్తిమీద సాములాంటివే. పార్టీకి ఎదురుగాలి వీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు సిట్టింగ్ స్థానాలు జారిపోకుండా ఉండాలంటే తానే స్వయంగా రంగంలోకి దిగాలని సీఎం కేసీఆర్​ భావించినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డినే ఫైనల్ చేసిన హైకమాండ్​, సాగర్ అభ్య ర్థి ఎవరనేది ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. నోటిఫికేషన్ వచ్చే వరకు ఇదే సస్పెన్స్​ కొనసాగించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. పైగా బై పోల్స్​లో ప్రధాన పోటీదారుగా భావిస్తున్న కాంగ్రెస్​లో  కూడా క్యాండేట్ గురించి రోజుకో మాట వినిపిస్తోంది. కాంగ్రెస్​ తరుపున జానారెడ్డి ఉంటారా? ఆయన కొడుకు రఘువీర్​రెడ్డిని బరిలో దింపుతారా? క్లారిటీ వచ్చాకే టీఆర్ఎస్​ తన క్యాండేట్​ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సీఎం, సభలో క్యాండేట్ గురించి ప్రస్తావించకుండా, కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల శంకుస్థాపన, ఎన్నికల సందేశాన్ని మాత్రమే వినిపిస్తారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

కోడ్ కూస్తదేమోనని.. పనుల్లో స్పీడ్.. క్వాలిటీ అడగొద్దు

లైన్ దాటి మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడ్త.. వినకపోతే కాళ్లు పట్టుకొని బండకు కొడతా

కేసీఆర్​ వార్నింగ్​ వెనుక మతలబేంది..? ఆరా తీస్తున్న కేడర్