
బిహార్లో కొత్తగా ఏర్పడిన 'మహాగట్ బంధన్' ప్రభుత్వం పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ-,జేడీయూ-, కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో అంతగా ఆదరణ లేదన్నారు. నితీశ్ కుమార్ సీఎం కుర్చీకి ఫెవికల్ అంటించుకుని కూర్చుంటే.. మిగతా పార్టీలు ఆయన చుట్టు తిరుగుతున్నాయంటూ ఆరోపించారు. 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ చేసిన ఉద్యోగాల ప్రకటన పై ప్రశాంత్ కిషోర్ స్పందించారు.
వచ్చే ఏడాది లేదా రెండేండ్లలో ఈ ప్రభుత్వం ఐదు నుంచి పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తే తన జన్ సురాజ్ అభియాన్ను ఆపేస్తానని, నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని తెలిపారు. బుధవారం సమస్తిపూర్లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసగించిన ప్రశాంత్ ఈ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు.
బీజేపీతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్... ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కలిసి బిహార్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎనిమిదో సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ వారం క్రితం ప్రమాణ స్వీకారం చేయగా,డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ గా బాధ్యతలు స్వీకరించారు.