ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్పోల్ సదస్సుకు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహ్సిన్ భట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్లను భారత్కు అప్పగిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. సమాధానం ఇవ్వడానికి మొహ్సిన్ భట్ నిరాకరించారు. ఇబ్రహీం, హఫీజ్ లు భారత భద్రతా ఏజెన్సీల మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పాకిస్తాన్లో నివసిస్తున్నారని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
జనరల్ అసెంబ్లీ అనేది ఇంటర్పోల్ అత్యున్నత పాలనా సంస్థ. దాని పనితీరుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఏటా ఒకసారి సమావేశమవుతుంది. ఈ సమావేశాలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతాయి. 195 ఇంటర్పోల్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఆయా దేశాలకు చెందిన మంత్రులు, పోలీసు చీఫ్లు, దేశ సెంట్రల్ బ్యూరోల అధిపతులు, సీనియర్ పోలీసు అధికారులు హాజరవుతారు. 1997లో భారత్లో చివరిసారిగా ఈ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగగా, మళ్లీ 25ఏళ్ళ తరువాత ఇప్పుడు జరుగుతున్నాయి.