ఐటీ సర్వీసెస్ కంపెనీ విప్రో గురువారం రూ.15 వేల కోట్ల విలువైన షేర్ బైబ్యాక్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఈ ప్రణాళికలో భాగంగా 60 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.250 ధరకు షేర్హోల్డర్ల నుంచి కొనుగోలు చేయనుంది. కంపెనీ షేరు సోమవారం బీఎస్ఈలో రూ.210.20 వద్ద క్లోజ్ అవ్వగా, దీనితో పోలిస్తే బైబ్యాక్ ధర సుమారు 18 శాతం ఎక్కువగా ఉంది. విప్రో సీఎఫ్ఓ అపర్ణ అయ్యర్ మాట్లాడుతూ, “ఇది మా అతిపెద్ద బైబ్యాక్. పెయిడప్ క్యాపిటల్లో 5.7శాతం వరకు కొనుగోలు చేస్తాం. జూన్లోపు ఈ ప్రోగ్రామ్ పూర్తవుతుంది” అని అన్నారు.
ప్రమోటర్ గ్రూప్ కూడా ఈ బైబ్యాక్లో పాల్గొననున్నట్లు తెలిపింది. 2025–26లో కంపెనీ దాదాపు రూ.12 వేల కోట్లను డివిడెండ్గా ఇచ్చింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో విప్రోకి రూ.3,501.8 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్తో పోలిస్తే ఇది 1.89 శాతం తక్కువ. ఆదాయం 7.6 శాతం పెరిగి రూ.24,236.3 కోట్లకు చేరింది. 2025–26 కి గాను షేరుకి రూ.11 చొప్పున ఫైనల్ డివిడెండ్ ఇచ్చేందుకు విప్రో బోర్డ్ ఆమోదం తెలిపింది.

