
న్యూఢిల్లీ: విప్రో సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2)లో రూ.22,697 కోట్ల రెవెన్యూ సాధించింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే ఇది 1.8శాతం ఎక్కువ. కంపెనీ నికర లాభం 1.2 శాతం పెరిగి రూ.3,246 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే మాత్రం 2.5శాతం తగ్గింది. ‘డిమాండ్ బాగుంది. క్లెయింట్లు ఏఐ ప్రాజెక్టులకు మారుతున్నారు.
ఈ నేపథ్యంలో “విప్రో ఇంటెలిజెన్స్’’ అనే ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ను తీసుకొచ్చాం”అని కంపెనీ సీఈఓ శ్రీని పల్లియా అన్నారు. ఈ ప్లాట్ఫామ్తో ఏఐ కన్సల్టింగ్, డేటా అడ్వైజరీ వంటి విభాగాల్లో విస్తరించడానికి వీలుంటుందని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ క్వార్టర్లో రెవెన్యూ 2,591–2,644 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని కంపెనీ రెవెన్యూ గైడెన్స్ ఇచ్చింది.
హర్మాన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్ కొనుగోలుతో వచ్చే ఆదాయం ఇందులో లేదు. కంపెనీ క్యూ2లో 4.7 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకుంది. ఏడాది లెక్కన 30.9శాతం వృద్ధి నమోదైంది. ఇందులో 13 పెద్ద డీల్స్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), హెల్త్కేర్ విభాగాల్లో 2 మెగా డీల్ రెన్యూవల్స్ ఉన్నాయి.
బీఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ కంపెనీ కంపెనీ ఎక్కువ ఆదాయం పొందుతోంది. ఈ సెక్టార్లోని కంపెనీలు ఆధునీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నాయని పల్లియా అన్నారు. వీటిని సాధించడంలో ఏజెంటిక్ ఏఐ కీలకమని చెప్పారు. టారిఫ్ అనిశ్చితుల కారణంగా ఇతర రంగాల్లోని క్లెయింట్లు తమ ఐటీ ఖర్చులపై ఆలోచిస్తున్నారని అన్నారు. ఏఐ ఆధారిత సొల్యూషన్లను అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.