
దుబాయ్: ఆసియాకప్లో టైటిల్ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా ఒక్క ఓటమితో ఫైనల్ రేసులో నిలవాలంటే చావో రేవో పరిస్థితి తెచ్చుకుంది. పాకిస్తాన్తో సూపర్– 4 తొలి మ్యాచ్లో చేతుల్లోకి విజయాన్ని వదులుకున్న రోహిత్సేన మంగళవారం జరిగే పోరులో శ్రీలంకతో పోటీ పడనుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన నేపథ్యంలో జట్టుపై కాస్త ఒత్తిడి ఉంది. రోహిత్సేన ముందుకెళ్లాలంటే బౌలర్లు తక్షణమే పుంజుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ పోరులో ఎక్కువ ప్రయోగాలు చేయకుండా ఉంటే మంచిది. గాయపడ్డ రవీంద్ర జడేజా, హర్షల్ పటలే, జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ఇండియా బౌలింగ్ బలహీనమైంది. ఆప్షన్స్ కూడా తగ్గిపోయాయి. ఆదివారం పాక్పై ఇండియా ఐదుగురు బౌలర్ల ప్లాన్ వర్కౌట్ కాలేదు. అరుదుగా విఫలమయ్యే పేస్ లీడర్ భువనేశ్వర్ కుమార్ ఎక్కువ రన్స్ ఇచ్చుకోవడం జట్టుపై ప్రభావం చూపింది. దీని నుంచి కోలుకొని భువీ బౌలింగ్ను ముందుండి నడిపించాల్సి ఉంది. గ్రూప్ దశ తొలి మ్యాచ్లో పాక్పై ఒంటిచేత్తో ఇండియాను గెలిపించిన స్టార్ ఆల్రౌండర్ పాండ్యా కూడా తేలిపోగా.. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఐదుగురు బౌలర్ల ఆప్షన్లో హార్దిక్ పాండ్యాతో నాలుగు ఓవర్లు వేయించడంపై విమర్శలు వస్తున్నాయి. గత పోరులో డకౌటై, బౌలింగ్లో నిరాశ పరిచిన పాండ్యా తిరిగి పుంజుకోవడం జట్టుకు చాలా అవసరం. జడేజాకు సరిగ్గా సరిపోయే అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకొస్తే టీమ్ను బ్యాలెన్స్ చేయొచ్చు. అనారోగ్యం కారణంగా గత మ్యాచ్కు దూరంగా ఉన్న యంగ్ పేసర్ అవేశ్ ఖాన్ థర్డ్ స్పెషలిస్ట్ పేసర్గా లంకపై బరిలోకి దిగే చాన్సుంది. రాబోయే టీ20 వరల్డ్కప్ కోసం ఇండియా బెస్ట్ ఎలెవన్ కోసం చూస్తోందని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయోగాలు కొనసాగించే అవకాశాలున్నాయి. ఇక, తుది జట్టులో చోటు కోసం కీపర్లు రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ మధ్య పోటీపై తీవ్ర చర్చనడుస్తుండగా.. మేనేజ్మెంట్ తొలి రెండు మ్యాచ్ల్లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే చాన్స్ రాని కార్తీక్ను తప్పించి దీపక్ హుడాను బరిలోకి దింపింది. కానీ, గత మ్యాచ్లో పంత్, హుడా ఇద్దరూ ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఈ ఇద్దరి విషయంలో ద్రవిడ్–రోహిత్ ఏం చేస్తారన్నది ఆసక్తికరం. పాకిస్తాన్తో పోరులో టాప్3 బ్యాటర్లు రోహిత్, రాహుల్, కోహ్లీ ఫామ్లోకి రావడం అది పెద్ద సానుకూలాంశం. ఆసియాకప్లో వరుసగా రెండో ఫిఫ్టీతో కోహ్లీ విమర్శలకు సమాధానం చెప్పగా..ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. శ్రీలంకపై కూడా ఈ ముగ్గురూ తొలి బాల్ నుంచే చెలరేగాలని అంతా ఆశిస్తున్నారు. బ్యాటింగ్లో పెద్దగా సమస్యలు లేకపోయినా.. బౌలింగ్లో రాణిస్తేనే ఈ మ్యాచ్లో గెలిచి ఇండియా ఫైనల్ రేసులో నిలవగలదు.
జోష్లో లంక
భారీ ఓటమితో టోర్నీని ఆరంభించిన శ్రీలంక వరుసగా రెండు విజయాలతో ఇప్పుడు జోరు మీదుంది. బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్పై ఒత్తిడిని జయించి టార్గెట్లను ఛేజ్ చేయడం ఆ జట్టు క్రికెటర్లలో కాన్ఫిడెన్స్ నింపింది. మూడో నంబర్లో ఆడుతున్న చరిత్ అసలంక తప్పితే మిగతా బ్యాటర్లంతా ఆకట్టుకుంటున్నారు. జట్టు విజయాల కోసం తలో చేయి వేస్తూ సమష్టిగా ముందుకెళ్తున్నారు. బంగ్లాపై కెప్టెన్ షనక, కుశాల్ మెండిస్ జట్టును గెలిపిస్తే.. దనుష్క గుణతిలక, భానుక రాజపక్స గత పోరులో అఫ్గాన్ పని పట్టారు. దాంతో, ఏ పరిస్థితుల్లో అయినా విజయం సాధించగలమనే నమ్మకం లంక ఆటగాళ్లలో పెరిగింది. అయితే, లంకతో పోలిస్తే ఇండియా అన్నింటా బలంగానే ఉంది. కానీ, షార్ట్ ఫార్మాట్లో చిన్న తప్పిదం చేసినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకు ఆదివారం రాత్రి పాక్ చేతిలో ఓటమే ఉదాహరణ. మరి, రోహిత్సేన లంకను ఓడించి టైటిల్ రేసులో నిలుస్తుందో లేదో చూడాలి.
జట్లు (అంచనా): ఇండియా: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్య, కార్తీక్/పంత్ (కీపర్), హర్దిక్, అక్షర్, భువనేశ్వర్, అవేశ్, అర్ష్దీప్, చహల్.
శ్రీలంక: నిశాంక, కుశాల్ మెండిస్ (కీపర్), అసలంక, గుణతిలక, రాజపక్స, షనక (కెప్టెన్), వానిందు, చమిక, తీక్షణ, అశిత ఫెర్నాండో, ముదుషనక.