
మ. 12.45 నుంచి సోనీ నెట్వర్క్లో
హరారే : స్టార్లు ఉన్నా లేకున్నా.. వైట్బాల్ ఫార్మాట్లో దూసుకెళ్తున్న టీమిం డియా మరో క్లీన్స్వీప్ విక్టరీపై గురి పెట్టింది. ఆతిథ్య జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం జరిగే తొలి మ్యాచ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్ ఫలితం కంటే ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్పైనే అందరి ఫోకస్ ఉంది. వరుస గాయాలతో నుంచి కోలుకొని రెండున్నర నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న కేఎల్ ఎలా ఆడుతాడు? అతని ఫామ్, ఫిట్నెస్పై ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెలలోనే మొదలయ్యే ఆసియాకప్తో పాటు టీ20 వరల్డ్కప్లో ఓపెనర్గా జట్టుకు కీలకం అయిన రాహుల్ తక్షణమే ఫామ్ అందుకుంటే మంచిది.
కేఎల్తో పాటు సీనియర్ ధవన్, గిల్, శాంసన్, హుడా, పేసర్లు సిరాజ్, అవేశ్, ప్రసిధ్, దీపక్ చహర్,స్పిన్నర్లు చహల్, కుల్దీప్తో ఇండియా పవర్ ఫుల్గాఉంది. ఫిబ్రవరి తర్వాత రీఎంట్రీ ఇస్తున్న దీపక్ చహర్కు కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. మరోవైపు ఫ్లవర్ బ్రదర్స్, హీత్ స్ట్రీక్ వంటి ప్లేయర్లు తప్పుకున్న తర్వాత జింబాబ్వే ఆట క్రమంగా పడిపోయింది. ఇటీవల ఇదే మైదానంలో బంగ్లాదేశ్ ఇచ్చిన 290, 300 ప్లస్ టార్గెట్లను ఛేజ్ చేయడం జింబాబ్వే జట్టులో ఆత్మవిశ్వాసం నింపేదే. కానీ, బలమైన టీమిండియాకు రెగిస్ చకబ్వా నేతృత్వంలోని ఆతిథ్య జట్టు ఏ మేరకు పోటీ ఇస్తుందన్నది చూడాలి. ఆ జట్టు ఎక్కువగా రజా, కెప్టెన్ చకబ్వా, తిరిపనోపై ఆశలు పెట్టుకుంది.