- 2020 నాటికి మరిన్ని ఏర్పాటు
- రూ. 250 కోట్ల పెట్టుబడి
- 8 వేల కొత్త ఉద్యోగాలు
- చైనా తర్వాత ఎక్కువ క్లౌడ్ కిచెన్లున్న దేశం మనదే
న్యూఢిల్లీ: స్విగ్గీ తన రెస్టారెంట్ పార్టనర్ల కోసం వెయ్యికి పైగా క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 12 కొత్త నగరాల్లో ఇలాంటి ఫెసిలిటీస్ మరిన్ని కల్పిస్తామని తెలిపింది. కేవలం రెండేళ్లలో, 14 సిటీల్లో 10 లక్షల చదరపు అడుగులకు పైగా రియల్ ఎస్టేట్ స్పేస్లో పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. ఈ రియల్ ఎస్టేట్ స్పేస్లోనే తమ చిన్న, పెద్ద, మధ్య తరహా రెస్టారెంట్ పార్టనర్లకు క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. భవిష్యత్లో ఫుడ్ డెలివరీకి క్లౌడ్ కిచెన్లను ఎప్పటికీ ఏర్పాటు చేస్తుంటామని, చైనా తర్వాత క్లౌడ్ కిచెన్లున్న రెండో అతిపెద్ద దేశంగా ఇండియా అవతరిస్తుందని స్విగ్గీ కొత్త సప్లయి సీఈవో విశాల్ భాటియా తెలిపారు. ఎండ్ కస్టమర్లకు డైన్ ఇన్ ఫెసిలిటీ అందించాల్సినవసరం లేకుండా.. ఆపరేటర్స్ ఫుడ్ను ప్రిపేర్ చేసి, ప్యాకేజ్ చేసి కస్టమర్లకు డెలివరీ చేయడమే క్లౌడ్ కిచెన్ల ఉద్దేశం. ఈ కిచెన్లను ఏర్పాటు చేయడానికి, రన్ చేయడానికి స్విగ్గీ గత రెండేళ్లలో రూ.175 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. 2020 మార్చి నాటికి 12 కొత్త నగరాల్లో మరిన్ని క్లౌడ్ కిచెన్లు ఏర్పాటు చేయడానికి అదనంగా రూ.75 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు భాటియా ప్రకటించారు. మెట్రోల్లో, టైర్ 2, టైర్ 3 నగరాల్లో కొత్త ఉద్యోగావకాశాలను కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. పార్టనర్ రెస్టారెంట్లు, సొంత బ్రాండ్ల క్లౌడ్ కిచెన్ ఆపరేషన్స్ ద్వారా, స్విగ్గీ రెస్టారెంట్ ఇండస్ట్రీలో ఎనిమిది వేలకు పైగా డైరెక్ట్, ఇన్డైరెక్ట్ ఉద్యోగాలను కల్పిస్తోందని తెలిపారు.
మళ్లీ స్విగ్గీ, జొమాటో విలీన చర్చలు…
స్విగ్గీ, జొమాటోలు మళ్లీ విలీన చర్చలు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు కంపెనీలకు చెందిన ముఖ్యమైన ఇన్వెస్టర్లు ఇటీవల చర్చలు ప్రారంభించారని చెప్పారు. ప్రస్తుత చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయన్నారు. స్విగ్గీకి మెయిన్ ఇన్వెస్టర్లుగా యాక్సెల్,నాస్పర్స్, టెన్సెంట్ ఉండగా.. జొమాటోకి ఇన్ఫోఎడ్జ్ ఎంటర్ప్రైజ్, యాంట్ ఫైనాన్సియల్, సెకోవియా ఉన్నాయి. అయితే ఈ రిపోర్ట్లను జొమాటో కొట్టివేసింది. స్విగ్గీతో ఎలాంటి విలీన, కొనుగోలు చర్చలు జరుపడం లేదని తేల్చిచెప్పింది. గతంలోనూ ఒకసారి, ఈ రెండు కంపెనీలు విలీన ప్రతిపాదన మీద చర్చలు జరిపాయి. కాకపోతే, అప్పట్లో అవి సఫలం కాలేదు. ఫుడ్ డెలివరీ రంగంపై దృష్టి పెట్టాలని ఉబర్ ఈట్స్ నిర్ణయించడంతోపాటు, అమెజాన్ కూడా త్వరలో రంగంలోకి రానున్న నేపథ్యంలో ఈ దిశలో చర్చలు మళ్లీ మొదలైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ దిగ్గజాలను తట్టుకునేందుకు ఈ ప్లాన్ చేస్తున్నాయని సమాచారం.