ఆదిలాబాద్ ​జిల్లా కేంద్రంలోని పలు సంఘాల ధర్నాలు

ఆదిలాబాద్ ​జిల్లా కేంద్రంలోని పలు సంఘాల ధర్నాలు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు : పలు సంఘాల ధర్నాలు, ఆందోళనలతో ఆదిలాబాద్ ​జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ సోమవారం దద్దరిల్లింది. జిల్లాలోని ఆయా మండలాల నుంచి కార్మికులు, ఉద్యోగులు, భూనిర్వాసితులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు రైల్వేస్టేషన్ ​నుంచి భారీ ర్యాలీగా వచ్చి ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాంట్లు, పెన్షన్​ కల్పించాలని డిమాండ్​ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మిడ్డే మీల్స్​ కార్మికులు ధర్నా చేశారు. పెండింగ్​ బిల్లులు, వేతనాలను మంజూరు చేయాలని కోరారు. ఇచ్చోడ మండలంలో పేద ప్రజలకు కేటాయించిన స్థలాలను వారికే ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ పలువురు కలెక్టరేట్​ ముందు ఆందోళనకు దిగారు. తమకు కేటాయించిన స్థలాలను ప్రభుత్వం వివిధ శాఖలకు కేటాయించడాన్ని ఖండించారు.

మంచిర్యాల : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ అంగన్​వాడీ టీచర్లు మంచిర్యాల కలెక్టరేట్​ఎదుట ధర్నా నిర్వహించిన కలెక్టర్ ​బదావత్ ​సంతోశ్​కు మెమోరాండం అందజేశారు. ఐసీడీఎస్​కు బడ్జెట్ పెంచాలని, నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలన్నారు. కనీసం వేతనం రూ.26 వేలు చెల్లించడంతో పాటు పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ ​చేశారు. 2018లో పెంచిన వేతనాన్ని ఏరియర్స్​తో సహా చెల్లించాలని, మూడేండ్లుగా పెండింగ్​ఉన్న ట్రాన్స్​పోర్ట్​చార్జీలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అందించాలని కోరారు.