- రోజూ 7 వేల మందికి బూస్టర్ టీకా
- పది రోజుల క్రితం వరకూ 4 వేల మందికే
- ఫ్రీగా వేస్తే ఇంకెక్కువ మంది వేస్కుంటరంటున్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, జూన్లో మరిన్ని పెరిగే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో జనాలు వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయించుకునేందుకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో పది రోజుల క్రితం వరకూ రోజూ సగటున 4 వేల మంది మాత్రమే బూస్టర్ డోసు తీసుకోగా, ఇప్పుడు రోజూ 7 వేల నుంచి 7,500 మంది బూస్టర్ డోసు వేయించుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో 60 ఏండ్ల లోపున్న వాళ్లకు బూస్టర్ డోసు వేసుకునేందుకు అవకాశం లేకపోవడం.. కేవలం ప్రైవేట్ ఆస్పత్రులకే అవకాశం ఇవ్వడంతో ఆ సంఖ్య తక్కువగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు.
సర్కార్ దవాఖాన్లలో ఫ్రీగా బూస్టర్ డోస్ వేస్తే మరింత ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం 60 ఏండ్లు దాటినోళ్లకే సర్కార్ దవాఖాన్లలో ఫ్రీగా బూస్టర్ డోసు వేస్తున్నారు. అయితే, 60 ఏండ్ల లోపున్నోళ్లకు ప్రభుత్వ దవాఖాన్లలోనూ బూస్టర్ డోసు వేసేందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి హరీశ్రావు లేఖ రాశారు. దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
పర్మిషన్ ఇస్తేనే ఫాయిదా
రాష్ట్రంలో ఇప్పటిదాకా 6.84 లక్షల మంది బూస్టర్ డోస్ వేసుకున్నారు. సెకండ్ డోసు తీసుకుని 9 నెలలు గడిచి, బూస్టర్ డోసుకు అర్హులైనోళ్లు ఇంకా 28.04 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం వద్ద 40.99 లక్షల కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. బూస్టర్ డోసుకు ప్రభుత్వ దవాఖాన్లకు పర్మిషన్ ఇవ్వకపోతే, ఇందులో చాలా డోసులు ఎక్స్పైరీ అయ్యే అవకాశం ఉంది. దీంతో త్వరలోనే బూస్టర్ డోసుకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు.
త్వరలోనే పిల్లలకు టీకా
రాష్ట్రంలో 18 ఏండ్లు దాటిన వాళ్లంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. 15–17 ఏండ్ల వయసు టీనేజర్లలో 91 శాతం మంది ఫస్ట్ డోసు, 77 శాతం మంది సెకండ్ డోసు తీసుకున్నారు. 12 నుంచి 14 ఏండ్ల పిల్లల్లో ఫస్ట్ డోస్ 86 శాతం, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ 33 శాతం పూర్తయింది. 5 నుంచి 11 ఏండ్ల పిల్లలకు టీకాలిచ్చే విషయంపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే కొన్ని వ్యాక్సిన్లకు అనుమతినిచ్చింది. దీనిపై ఓ వారం రోజుల్లో కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి గైడ్లైన్స్ వచ్చే అవకాశం ఉందని, ఆ వెంటనే పిల్లలకు టీకాలు వేస్తామని అధికారులు చెప్తున్నారు.
అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలె
కరోనాను ఎదుర్కొంనేందుకు ఆయుధం వ్యాక్సిన్. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. రాష్ట్రంలో ఇప్పటికే పెద్ద వాళ్లంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. పిల్లల వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే వెంటనే వేసుకోవాలి. అర్హులైనోళ్లు బూస్టర్ డోసు వేయించుకోవాలి. సర్కార్ దవాఖాన్లలో బూస్టర్ డోసుకు అనుమతివ్వాలని ఇటీవలే రాష్ట్ర సర్కార్.. కేంద్రాన్ని కోరింది. పర్మిషన్ వచ్చిన వెంటనే ప్రభుత్వ సెంటర్లలో కూడా బూస్టర్ డోసును ప్రారంభిస్తం. ‑ డాక్టర్ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
ఇవి కూడా చదవండి
వచ్చే ఏడాది నుంచి పల్లె విద్యార్థులకు ఇంటి వద్దకే వర్సిటీలు
మన రక్తంలో మైక్రో ప్లాస్టిక్!
దరఖాస్తులు క్లియరైనా నిధులు విడుదల చేస్తలె