హైదరాబాద్, వెలుగు:కరోనాతో మహమ్మారితో క్యాబ్, ఆటో డ్రైవర్లు ఆగమైతున్నారు. లాక్డౌన్తో వారి ఉపాధికి గండి పడింది. దీంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది. ఇటు నెల తిరగ్గానే కిస్తీలు కట్టాలని ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. గత్యంతరం లేక డ్రైవర్లు ఇతర ప్రత్యామ్నాయ పనులు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో డ్రైవర్లకు ఆయా ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తున్నాయి. కానీ రాష్ట్రంలో మాత్రం సర్కారు పట్టించుకోవట్లేదు.
5 లక్షల క్యాబ్లు, లక్షకు పైగా ఆటోలు..
రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షకు పైగా క్యాబ్లు, లక్ష వరకు ఆటోలు ఉంటాయి. కరోనా కంటే ముందు క్యాబ్ డ్రైవర్లకు రోజుకు రూ.1,500 నుంచి రూ. 2,000 వరకు వచ్చేది. ప్రస్తుతం 500 కూడా రావడం లేదని వారు వాపోతున్నారు. కరోనా వ్యాప్తి భయంతో ఎక్కువ శాతం మంది క్యాబ్స్, ఆటోల్లో ప్రయాణించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సొంత వాహనాలకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇటు అనేక సంస్థల్లో వర్క్ ఫ్రం హోం పనిచేస్తున్నారు. దీంతో జనం ఇంటికే పరిమితమవుతున్నారు. ఇక అంబులెన్స్లు అందుబాటులో లేక, దొరికినా అధిక చార్జీలు ఉండటంతో అనేక చోట్ల కరోనా పేషెంట్లు క్యాబ్లు, ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. దీంతో డ్రైవర్లకు కూడా వైరస్ సోకుతోంది. ఒక్క హైదరాబాద్లోనే 700 మంది క్యాబ్ డ్రైవర్లకు కరోనా సోకిందని అసోసియేషన్ లీడర్లు చెబుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి కొందరు చనిపోయారని కూడా అంటున్నారు.
పూట గడుస్తలె.. రెంట్లు కడ్తలె..
క్యాబ్లు, ఆటోలు నడుపుకొనే వారంతా పేదవారే. బండి బయటకు తీస్తే గానీ వారి పూట గడవదు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో డ్రైవర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చేతిలో డబ్బులు లేకపోవడంతో రెంట్లు కూడా కట్టడం లేదు. నిత్యావసర సరుకులకు కూడా డబ్బులు ఉండని పరిస్థితి. ఇక వీళ్లలో చాలామంది బండ్లను లోన్లు పెట్టి కొంటారు. నెలనెలా కిస్తీలు కడుతుంటారు. కానీ బండ్లు సరిగ్గా నడవక రెండు నెలలుగా కిస్తీలకు అవస్థలు పడుతున్నారు. మరోవైపు బండి కిస్తీలు కట్టాలని ఫైనాన్షియర్లు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కొందరు బండ్లను సెకండ్ హ్యాండ్లో అమ్ముకుంటున్నారు. మరో వైపు ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ మూడు నెలలకోసారి ట్యాక్స్ కట్టాలి. వాహనాన్ని బట్టి, సీట్లను బట్టి ట్యాక్స్ ఉంటుంది. రెండు నెలలుగా గిరాకీలే లేకపోవడంతో ట్యాక్స్లు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని డ్రైవర్లు వాపోతున్నారు. ట్యాక్స్ మాఫీ చేయాలని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటున్న తీరుగా ఏదో రకంగా తమను ఆదుకోవాలని రాష్ట్ర సర్కార్ ను యూనియన్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.
కారులో ఉల్లిగడ్డలు అమ్ముతున్న..
నేను ఉబర్లో డ్రైవర్గా చేసేది. లోన్ పెట్టి బండి తీసుకున్న. ఇప్పుడు కరోనాతో ప్యాసింజర్లు రావడం లేదు. ఉబర్ ఓపెన్ చేసి పెట్టినా రోజుకు ఒకటి, రెండు బుకింగ్స్ కూడా రావడం లేదు. ప్యాసింజర్లు వచ్చినా వారంతా కరోనా పేషెంట్లే. ఇద్దరు పిల్లలున్నారు. భయంతో చేసేదేం లేక జైలో బండిలో సీట్లు తీసేసి, అందులో ఉల్లిగడ్డలు అమ్ముతున్న. నెలకు 25 వేల కిస్తీ కట్టాలి. ప్రభుత్వమే ఆదుకోని ఆర్థికంగా సాయం చేయాలి.
- లక్ష్మి, క్యాబ్ డ్రైవర్, హైదరాబాద్
రూ.8,500 ఆర్థిక సాయం చేయాలె
కరోనాతో జనాలు క్యాబ్లు ఎక్కడం లేదు. ఓన్ వెహికల్స్లోనే ప్రయాణిస్తున్నారు. అనేక మంది డ్రైవర్లకు కరోనా సోకింది. సర్కారు పట్టించుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఒక్కో డ్రైవర్కు నెలకు 8,500 ఆర్థిక సాయం అందించాలి. కరోనాతో చనిపోయిన డ్రైవర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వీలైనంత త్వరగా డ్రైవర్లందరికీ వ్యాక్సిన్ వేయాలి.
- ఎస్కే సలావుద్దీన్, చైర్మన్, తెలంగాణ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ