- కార్యాలయం తరలింపుపై నిరసనలు.. విమర్శలు
- కొత్త జోనల్వ్యవస్థతో అనూహ్య మార్పులు
మెదక్, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు టెరిటోరియల్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ (డీఎఫ్వో), వైల్డ్ లైఫ్ డివిజన్ ఆఫీస్ (డీఎఫ్ వో) మెదక్ పట్టణంలో, సోషల్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ (డీఎఫ్ వో) సంగారెడ్డిలో ఉండేవి. ఈ మూడు ఆఫీసులు నిజామాబాద్ ఫారెస్ట్ సర్కిల్ పరిధిలో ఉండేవి. 2016లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో టెరిటోరియల్, వైల్డ్ లైఫ్, సోషల్ ఫారెస్ట్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఈ క్రమంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు వేర్వేరుగా డిస్ట్రిక్ ఫారెస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేయగా, ఈ మూడింటిని కలిపి ఒక ఫారెస్ట్ సర్కిల్ గా ఏర్పాటు చేశారు. ఈ మేరకు మెదక్ సర్కిల్ హెడ్ క్వార్టర్ను మెదక్ పట్టణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్కిల్ ఇన్చార్జిగా ఫారెస్ట్ కన్వర్వేటర్ (సీసీఎఫ్)ను నియమించారు.
సిద్దిపేటకు తరలింపు..
రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటైన నేపథ్యంలో 2019లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ సర్కిళ్ల పునర్ వ్యవస్థీకరణ చేపట్టింది. గతంలో 12 ఫారెస్ట్ సర్కిళ్లు ఉండగా వాటిని ఏడుకు కుదించింది. ఈ క్రమంలో మెదక్ ఫారెస్ట్ సర్కిల్ రద్దయింది. మెదక్, సిద్దిపేట జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేసిన రాజన్న సిరిసిల్ల సర్కిల్ పరిధిలోకి వెళ్లగా, సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన చార్మినార్ సర్కిల్ పరిధిలోకి వెళ్లింది. రాజన్న సిరిసిల్ల ఫారెస్ట్ సర్కిల్ హెడ్ క్వార్టర్ సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. కాగా ఈ నిర్ణయం జరిగిన మూడేళ్ల తర్వాత సిద్దిపేటలో ఫారెస్ట్ సర్కిల్ ఆఫీస్ రెడీ అయ్యింది. దీంతో ప్రస్తుతం మెదక్ లో ఉన్న ఫారెస్ట్ సర్కిల్ ఆఫీస్ ను అక్కడికి తరలించారు. ఇక్కడి స్టాఫ్ ను సర్దుబాటు చేస్తున్నారు. మెదక్ సర్కిల్ ఆఫీస్ రద్దు కావడంతో ఇంతవరకు మెదక్ లో సీసీఎఫ్గా పనిచేసిన శరవనణ్ నిర్మల్ బాసర సర్కిల్ కు ట్రాన్స్ఫర్అయ్యారు. ఇదిలా వుండగా, మెదక్లో ఉన్నఫారెస్ట్ సర్కిల్ ఆఫీస్ ఎత్తివేసి జిల్లాను సిద్దిపేటలో కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన రాజన్న సిరిసిల్లా సర్కిల్ పరిధిలోకి చేర్చడంపై ఇక్కడి ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
మెదక్ జిల్లాలో అటవీ విస్తీర్ణం 58 వేల హెక్టార్లు ఉండగా, సిద్దిపేట జిల్లాలో 23 వేల హెక్టార్లు మాత్రమే ఉంది. మెదక్ జిల్లాలో అడవులతోపాటు, పోచారం వైల్డ్లైఫ్ శాంచరీ, అందులో రెండు జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అందువల్ల మెదక్లోనే కొత్త సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫారెస్ట్ సర్కిల్ ఆఫీస్ మెదక్ నుంచి సిద్దిపేటకు తరలిపోయింది. అటవీశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ సర్కిళ్లను పునర్ వ్యవస్థీకరించడంతో ఈ మార్పు జరిగింది. కాగా, ఎక్కువ అటవీ విస్తీర్ణం, దట్టమైన అడవులు, అభయారణ్యం ఈ జిల్లా పరిధిలో ఉండగా, సర్కిల్ ఆఫీస్ ను మరో జిల్లాకు తరలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు నిరసన తెలుపుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన
మెదక్ నుంచి ఫారెస్ట్ సర్కిల్ ఆఫీస్ను ఎత్తివేసి సిద్దిపేటలో ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. టీపీసీసీ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఫారెస్ట్ సర్కిల్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెదక్ పట్టణం జిల్లా అటవీ కార్యాలయాలకు కేంద్రంగా ఉన్న విషయాన్నిఆయన గుర్తు చేశారు. ఎక్కువ విస్తీర్ణం అడవులు, అభయారణ్యం ఉన్న జిల్లాలోని సర్కిల్ ఆఫీస్ ను తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్నజిల్లాకు తరలించడం సరైంది కాదన్నారు. కొత్త కార్యాలయాలకు తీసుకురావాల్సింది పోయి ఉన్న కార్యాలయాలు మరోచోటకు తరలిస్తున్నా అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిదులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.