- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరుపకుండానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంట్లో ఏకపక్షంగా ప్రకటించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాసే, ప్రమాదకరమైన లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలతో కార్మికులు తమ రక్షణ కోసం సాధించుకున్న 29 పాత చట్టాలకు కేంద్రం తెచ్చిన లేబర్కోడ్స్ తిలోదకాలు ఇస్తున్నాయని చెప్పారు.
కార్మికుల వేతనాలు, పని గంటలు, సామాజిక భద్రత వంటి హక్కులను కాలరాస్తున్నాయని పేర్కొన్నారు. కార్మికులు సమ్మె చేసే హక్కును కోల్పోతారని, కార్పొరేట్లకు అనుకూలంగా, కార్మికుల హక్కులకు తీవ్ర నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
