దేశంలో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (UPA) లేనే లేదన్న పశ్చిమ బెంగాల్ సీఎం ,TMC అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ లేని UPA అంటే ఆత్మ లేని శరీరమేనని అన్నారు కాంగ్రెస్ నేత కపిల్ సిబల్. మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పోరాడుతున్న పలు సామాజిక రాజకీయ సమస్యల్లో TMCని కూడా భాగస్వామిగా చేర్చడానికి యత్నించామని, ప్రతిపక్షాలు చీలిపోయి పోట్లాడుకోవడం కాదని, కలిసికట్టుగా బీజేపీపై పోరాడాలని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
మరోవైపు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్య్రాట్రిక్ విజయం సాధించిన మమతా బెనర్జీ... ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ స్థానాన్ని TMC భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే గోవా, మేఘాలయల్లో కాంగ్రెస్ కీలక నేతలను తన వైపు తిప్పుకున్నారు. మరిన్ని రాష్ట్రాల నేతలతోనూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.