
- ఒక్కోటి 0.5 మెగావాట్లతో జిల్లాలో రెండు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం
- ఒక్కో ప్లాంటుకు రూ.1.50 కోట్లు కేటాయింపు
- ఇప్పటికే ల్యాండ్ సర్వే పూర్తి
- దసరాలోపు ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్ల కసరత్తు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మహిళల నిర్వహణలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ల్యాండ్ సర్వే పూర్తి కాగా దసరాలోపు ప్లాంట్లు అందుబాటులోకి తీసుకురావాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ప్రాజెక్టు కింద ప్రతీ జిల్లాకు రెండు ప్లాంట్లు మంజూరు చేసింది. దీనిలో భాగంగా జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్లో, మంథని నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు ఒక్కోదానికి రూ.1.50 కోట్లు ఖర్చు చేయనుంది. ఒక్కో ప్లాంట్ ద్వారా 0.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది.
మహిళా సంఘాల ద్వారా నిర్వహణ
మహిళల ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉద్ధాన్ మహాభియాన్ స్కీమ్ అమలుచేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీఏ, టీజీరెడ్-కో, ట్రాన్స్కో భాగస్వామ్యంతో ప్రతి జిల్లాకు 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. వీటి బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించనుంది.
డిసెంబర్లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సభలో మహిళా సాధికారత కోసం సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్నామని, దీంతోపాటు ప్లాంట్ల నిర్వహణ మహిళలకు ఇస్తామని సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రకటించారు. ఈ క్రమంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు జిల్లాలో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
జిల్లాలో నాలుగు సోలార్ పవర్ ప్లాంట్లు
పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే నాలుగు సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు సమాచారం. రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపీసీలో గ్రౌండ్సోలార్ప్లాంటు ద్వారా 10 మెగావాట్లు, వాటర్ప్లోటింగ్సోలార్ప్లాంటు ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ఉత్పత్తి అవుతోంది. మంథని, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో కూడా ఇప్పటికే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా మరో 40 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా సేకరించిన భూములు కావడంతో తరుచుగా రైతుల ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో ప్రభుత్వ భూములను గుర్తించి రానున్న రోజుల్లో మహిళల నేతృత్వంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా కనీసం వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే అంచనాలో అధికారులు ఉన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల రామగుండం నియోజవర్గంలో విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన టైంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ మహిళల ద్వారా సోలార్పవర్ ఉత్పత్తి చేసి, వారిని కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చారు. ఈక్రమంలో పెద్దపల్లి జిల్లాలో రానున్న రోజుల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు జరగనుంది.
గైడ్ లైన్స్ ప్రకారం ముందుకెళ్తాం.
సోలార్ ప్లాంట్ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆదేశానుసారం, ప్రభుత్వ స్థలాలను పరిశీలించాం. జిల్లాలో రెండు స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాం. సోలార్ ప్లాంట్ల నిర్మాణం, కేటాయింపులపై ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారం ముందుకెళ్తాం.
ఎం.కాళిందిని, డీఆర్డీవో, పెద్దపల్లి జిల్లా