న్యూఢిల్లీ: మగవారి కంటే మహిళలకు అప్పులివ్వడం సేఫ్ అని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సిబిల్ పేర్కొంది. వీరికిచ్చిన లోన్లు మగవారితో పోలిస్తే తక్కువగా డీఫాల్ట్ అవుతున్నాయని తెలిపింది. మహిళా బారొవర్లలో 57 శాతం మందికి ఎక్కువ సిబిల్ స్కోర్ ఉందని, వీరు ప్రైమ్ కేటగిరీలో ఉన్నారని వెల్లడించింది. అదే మగ బారోవర్లలో 51 శాతం మంది ప్రైమ్ కేటిగిరీ కింద ఉన్నారని తెలిపింది. కాగా, సాధారణంగా బిజినెస్ల కంటే రిటైలర్లకు ఇచ్చే లోన్లు సేఫ్ అని లెండర్లు భావిస్తారు. హోమ్, వెహికల్ ఇలా ఏదో అసెట్ను సెక్యూరిటీగా తీసుకొని ఈ లోన్లు ఇస్తారు కాబట్టి రిటైల్ లోన్లివ్వడంలో రిస్క్ తక్కువగా ఉంటుందని అనుకుంటారు. మహిళలు పర్సనల్, కన్జూమర్ డ్యూరబుల్ లోన్లు వంటివి తీసుకోవడం కూడా పెరిగిందని సిబిల్ వెల్లడించింది.
మహిళలు జాబ్స్ చేయడం పెరుగుతోందని, ఫలితంగా వీరు అప్పులు తీసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారని అంచనావేసింది. బిజినెస్ లోన్లు తీసుకునే మహిళలు కూడా ఎక్కువయ్యారని, మొత్తం బిజినెస్ లోన్లలో వీరి వాటా 32 శాతానికి చేరుకుందని వెల్లడిచింది. ప్రస్తుతానికి రిటైల్ లోన్లు తీసుకున్నవారిలో 28 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. వీరిలో 34 శాతం మంది మొదటిసారిగా లోన్ తీసుకున్నవారే. దేశంలో సుమారు 45 కోట్ల మంది మహిళలుంటే (పెద్దవారు) , ఇందులో 6.3 కోట్ల మంది మాత్రమే యాక్టివ్ బారోవర్లుగా ఉన్నారని సిబిల్ వివరించింది. కొత్తగా అప్పు తీసుకుంటున్న వారిపై సంస్థ స్టడీ చేసింది. ఈ స్టడీ ప్రకారం, దేశంలో వ్యవసాయ రుణాలు మగవారితో పోలిస్తే మహిళలే ఎక్కువగా తీసుకున్నారు. కన్జూమర్ డ్యూరబుల్ లోన్లనూ తీసుకోవడం పెరిగింది. కాగా, కిందటేడాది మహిళల నుంచి 8 కోట్ల లోన్ అప్లికేషన్లు రాగా, అదే ఏడాది 7.27 కోట్ల అప్లికేషన్లకు లోన్లు డిస్బర్స్ అయ్యాయి. వీటిలో మెజార్టీ వాటా కన్జంప్సన్ లోన్లు (ఫ్రిజ్, టీవీ వంటి కొనడానికి చేసిన లోన్లు) ఉన్నాయి. దేశంలోని రిటైల్ లోన్ల బకాయిల్లో మహిళా బారోవర్ల నుంచి రూ.16 లక్షల కోట్లున్నాయి. మొత్తం లోన్లలో ఇది 19 శాతానికి సమానం. తమిళనాడులో ఎక్కువ మంది మహిళా బారోవర్లు (91.7 లక్షలు) ఉన్నారు.
రియల్ ఎస్టేట్ వైపే మహిళల చూపు..
షేర్లు, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అనరాక్ సర్వే వెల్లడించింది. 65 శాతం మంది మహిళలు ఇల్లు లేదా ల్యాండ్ కొనుక్కోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని తెలిపింది. ఈ సర్వే ప్రకారం, 20 శాతం మంది షేర్లలో, 8 శాతం మంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని 7 శాతం మంది వెల్లడించారు. మొత్తం 5,500 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే చేశామని అనరాక్ పేర్కొంది. ఇందులో సగం మంది మహిళలు ఉన్నారని తెలిపింది. ఈ మహిళల్లో 65 శాతం మంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లపై మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం, 83 శాతం మంది మహిళలు రూ.45 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఇండ్లను కొనడానికి ఆసక్తి చూపించారు. రూ.45-90 లక్షల మధ్య ధర ఉన్న ఇంటిని తీసుకుంటామని 36 శాతం మంది మహిళలు పేర్కొన్నారు. 27 శాతం మంది మాత్రం రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య రేటు ఉన్న ఇండ్ల వైపు మొగ్గు చూపారు. రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ రేటు ఉన్న లగ్జరీ ఇండ్లకు ప్రాధాన్యం ఇస్తామని 20 శాతం మంది చెప్పారు. రూ.45 లక్షల కంటే తక్కువ రేటు ఇండ్లకు ప్రాధాన్యం తగ్గిందని అనరాక్ సర్వే వెల్లడించింది. ఇండ్లను తీసుకునే వారిలో మహిళల వాటా పెరుగుతోందని, ముఖ్యంగా అర్బన్ సిటీలలో వీరు కీలక బయ్యర్లుగా ఉన్నారని అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ అన్నారు. పెద్ద ఇండ్లు, వెంటనే దిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లు వంటి వివిధ రకాల ప్రాపర్టీల వైపు మహిళలు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఏం కావాలో వారికి బాగా తెలుసని అన్నారు. చాలా మంది మహిళలు ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ప్రాపర్టీలను కొంటున్నారని పేర్కొన్నారు.