- నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఘటన
- తప్పుడు కేసు పెట్టిన యాజమాన్యం, పోలీసులే కారణమన్న సోదరి
- తమకు సంబంధం లేదన్న డీఎస్పీ
కొల్లాపూర్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఓ మహిళపై గత ఏడాది దొంగతనం నేరం మోపగా అప్పుడే విచారణ జరిపిన పోలీసులు...మళ్లీ ఇప్పుడు ఎంక్వైరీ రావాలని పిలవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం...కొల్లాపూర్కు చెందిన లక్ష్మి(28) గత ఏడాది పట్టణంలోని సాయికృప ప్రైవేట్హాస్పిటల్లోని మెడికల్ షాపులో పని చేసింది. అప్పుడు మెడికల్షాపులో డబ్బులు పోయాయంటూ దవాఖాన యాజమాన్యం లక్ష్మిపై చోరీ కేసు పెట్టింది.
దీంతో కొల్లాపూర్ పోలీసులు ఆమెను అప్పట్లోనే రెండు మూడు సార్లు పోలీస్స్టేషన్కు పిలిపించి విచారించారు. తనకు ఏ పాపం తెలియదని, దొంగతనం చేయలేదని చెప్పడంతో మళ్లీ పిలవలేదు. దీంతో ఊర్లో పరువు పోయిందని లక్ష్మి భర్త, పాపతో కలిసి చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామానికి వెళ్లిపోయింది. గురువారం కొల్లాపూర్ పోలీసులు లక్ష్మికి మళ్లీ ఫోన్ చేశారు. దొంగతనం కేసులో నోటీసు తీసుకోవడానికి పోలీస్స్టేషన్కు రావాలని పిలిచారు.
దీంతో ఊరు మారినా తనను వదిలిపెట్టడం లేదనే మనస్తాపంతో బయట ఎక్కడో పురుగుల మందు తాగింది. తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి కింద పడిపోయింది. దీంతో పోలీసులు ఫిట్స్వచ్చిందనుకుని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఈ ఘటనపై మృతురాలి అక్క మాట్లాడుతూ హాస్పిటల్ యాజమాన్యం తప్పుడు కేసు పెట్టిందని, పోలీసులు ఏడాదిగా విచారణ పేరిట ఇబ్బందులు పెడుతుండడంతో తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందన్నారు.
బాధ్యులైన ఇద్దరు ఎస్ఐలు, కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలన్నారు. సీఐ మహేశ్ను వివరణ కోరగా ‘దొంగతనం కేసులో లక్ష్మిని విచారణకు పిలిచి ఉండొచ్చు...పిలవకపోవచ్చు’ అని పొంతన లేని సమాధానమిచ్చారు. బహుశా..కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఉండవచ్చన్నారు.
అవును విచారణకు పిలిచాం : డీఎస్పీ
గత ఏడాది జరిగిన దొంగతనం కేసులో లక్ష్మిని ఎస్ఐ విచారణకు పిలిచారని డీఎస్పీ శ్రీనివాస్యాదవ్ తెలిపారు. కానీ, లక్ష్మి ఇంట్లో భర్తతో గొడవ కారణంగా అప్పటికే పురుగుల మందు తాగి పీఎస్కు వచ్చిందన్నారు. ఆమెను కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నించామని, కానీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆమె మరణానికి, తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
