
హైదరాబాద్, వెలుగు: ప్రతిష్టాత్మక విమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ రెండో ఎడిషన్ మరోసారి పోస్ట్పోన్ అయింది. హైదరాబాద్ వేదికగా ఆగస్టు 3 నుంచి 10 వరకు జరగాల్సిన ఈ టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ).. ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్)కు లెటర్ రాసింది. ఈ టోర్నీ వాయిదాపడటం ఇది రెండోసారి. 13 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత పట్టాలెక్కిన ఈ వరల్డ్ కప్ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్లో బిహార్లోని పాట్నాలో జరగాల్సి ఉంది. కానీ బిహార్ ఆతిథ్య హక్కులు వదులుకోవడంతో ఏకేఎఫ్ఐ తెలంగాణకు ఈ టోర్నీని కేటాయించింది. కానీ, ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ వివరాలను సకాలంలో ఇవ్వకపోవడంతో టోర్నీని వాయిదా వేయాల్సి వస్తోందని ఏకేఎఫ్ఐ తెలిపింది.
ఈ కారణంగా సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు పొందడంలో సమస్యలు తలెత్తినట్లు తెలిపింది. పాల్గొనే దేశాల జాబితాలో ఎటువంటి మార్పులనూ అంగీకరించబోమని ఏకేఎఫ్ఐ స్పష్టం చేసింది. ఈ టోర్నీలో 2012లో జరిగిన తొలి ఎడిషన్ విన్నర్ ఇండియాతో పాటు అర్జెంటీనా, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఇరాన్, జపాన్, కెన్యా, నేపాల్, థాయ్లాండ్, ఉగాండా, జాంజిబార్, పోలాండ్ మొత్తం 14 దేశాలు పాల్గొనాల్సి ఉంది. రెండుసార్లు వాయిదాపడిన ఈ టోర్నమెంట్ వైజాగ్లో ఆగస్టు 29న మొదలయ్యే ప్రో కబడ్డీ లీగ్ ముగిసిన తర్వాత జరుగుతుందని తెలుస్తోంది.