‘డబుల్’​ ఇండ్లు రాలేదని  తహసీల్దార్​ ఆఫీసులో మహిళల నిద్ర

‘డబుల్’​ ఇండ్లు రాలేదని  తహసీల్దార్​ ఆఫీసులో మహిళల నిద్ర
  •     ఆలేరులో వినూత్న నిరసన 

యాదాద్రి, వెలుగు : డబుల్ బెడ్ రూమ్​ఇండ్ల కోసం మహిళలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇండ్లు లేవంటూ, వెంటనే ఇవ్వాలంటూ యదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు తహసీల్దార్​ ఆఫీసులో బుధవారం రాత్రి నిద్రపోయారు. యాదాద్రి జిల్లా ఆలేరులో 64  డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు నిర్మించారు. వీటి పంపిణీకి ఇటీవల అప్లికేషన్లు ఆహ్వానించి 120 మందిని అర్హులుగా గుర్తించారు. ఇటీవల నిర్వహించిన డ్రాలో లబ్ధిదారులను ఎంపిక చేశారు.

డ్రాలో బీఆర్ఎస్​లీడర్లు, కౌన్సిలర్లకు సంబంధించిన వారి పేర్లే వచ్చాయని, వారికే ఇండ్లు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే అర్హులైన తమకు ఇండ్లు రాలేదని మున్సిపాలిటీలోని 4వ వార్డుకు చెందిన మహిళలు కొందరు బుధవారం సాయంత్రం ఆలేరు తహసీల్దార్​ఆఫీసుకు వెళ్లారు. ఇండ్లు లేని తమకు తహసీల్దార్​ఆఫీసే ఇల్లంటూ అక్కడి వరండాలో కూర్చున్నారు. కొందరు మహిళలైతే ఏకంగా నిద్ర పోయారు.

విషయం తెలుసుకున్న తహసీల్దార్​రామక్రిష్ణ పోలీసులకు సమాచారం అందించగా, వారు చేరుకొని మహిళలకు నచ్చజెప్పారు. చివరకు రాత్రి 10.30 గంటలకు వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మహిళలే గురువారం ర్యాలీ నిర్వహించారు. ఇండ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడిన తహసీల్దార్​రామకృష్ణను కూడా సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు.