సంకల్ప బలం ఉంటే వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తోంది మూలే వైష్ణవి. కాళ్లనే చేతులుగా మలుచుకుని జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అంతేకాకుండా చక్కటి చిత్రాలను గీస్తూ శభాష్ అనిపించుకుంటోంది.
వైష్ణవి తండ్రి మనోహర్ రెడ్డి పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి హైమావతి టీచర్గా పనిచేస్తున్నారు. వైకల్యం వేధిస్తున్నప్పటికీ... కష్టపడి చదివి పీజీ పూర్తి చేసింది వైష్ణవి. ఆమె 2024 డిసెంబర్ 9న జూనియర్ అసిస్టెంట్గా విధుల్లో చేరింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సీపీఆర్వో విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తోంది.
‘‘శారీరక వైకల్యం ఉన్నప్పటికీ అది నాకు ఎప్పుడూ అడ్డు కాలేదు. నగర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు గర్వంగా ఉంది” అంటోంది వైష్ణవి. రాయడం, బొమ్మలు గీయడం నుంచి అన్ని పనులూ కాళ్లతోనే చేస్తోంది. కమిషనర్ ఆర్వీ కర్ణన్ కూడా ఆమె స్పూర్తి ప్రస్థానాన్ని ‘ఎక్స్’ వేదికగా మెచ్చుకున్నారు. వైష్ణవి అంకితభావం, పట్టుదల నగరాభివృద్ధికి కృషి చేస్తున్న తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ప్రశంసించారు.
– వెలుగు,మహిళా దినోత్సవం ప్రత్యేకం–
