- పెరుగుతున్న ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల సేల్స్
- టెంపరరీ రోల్స్ కోసం హైరింగ్ పెంచిన కన్జూమర్ డ్యూరబుల్ కంపెనీలు
- టైర్ 2,3 సిటీలకు బిజినెస్ను విస్తరిస్తుండడమే కారణం
న్యూఢిల్లీ: చిన్న పట్టణాల్లో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. వేసవి మొదలవడంతో ఏసీలు, కూలర్లు వంటి కూలింగ్ అప్లియెన్స్లకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా కన్జూమర్ డ్యూరబుల్ కంపెనీలు పార్ట్ టైమ్ వర్కర్లను నియమించుకోవడం పెంచాయి. స్టాఫింగ్ కంపెనీలు టీమ్లీజ్ సర్వీసెస్, మ్యాన్పవర్ గ్రూప్ల ప్రకారం, కిందటేడాదితో పోలిస్తే ఈసారి టైర్ 2,3 సిటీల్లో హైరింగ్ యాక్టివిటీ 30 శాతం పెరిగింది. వైజాగ్, గుంటూరు, నెల్లూరు, కోయంబత్తూర్, కటక్, మదురై, పానిపట్, వారణాసి, రాయ్పూర్, నాగ్పూర్, జైపూర్, పాట్నా, కాలికట్ వంటి సిటీలలో వర్కర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. పెద్ద కంపెనీలు తమ విజినెస్ను విస్తరించడంపై ఫోకస్ పెట్టాయి.
టైర్ 2,3 సిటీలలో తమ నెట్వర్క్ను పెంచుకుంటున్నాయి. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు, ఇన్వర్టర్లకు డిమాండ్ బాగుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ‘ ఏడాది కిందటితో పోలిస్తే చిన్న పట్టణాల్లో సేల్స్, సర్వీస్ జాబ్ రోల్స్కు డిమాండ్ 25 శాతం నుంచి 30 శాతం పెరిగింది’ అని టీమ్లీజ్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణియన్ అన్నారు. ఇదే టైమ్లో మెట్రో సిటీల్లో వర్కర్ల డిమాండ్ 15–20 శాతం పెరిగిందని పేర్కొన్నారు. కన్జూమర్ డ్యూరబుల్ ఇండస్ట్రీలో వర్కర్ల డిమాండ్ 25 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగిందని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వివరించారు. మెట్రో సిటీలతో పోలిస్తే చిన్న టౌన్లలో ఈ డిమాండ్ కనీసం 15 శాతం ఎక్కువ ఉందని అన్నారు. సప్లయ్ చెయిన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మెరుగవ్వడంతో పెద్ద కంపెనీలు చిన్న టౌన్లకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాయన్నారు. ఇందుకోసం ఉద్యోగులు అవసరమవుతారని పేర్కొన్నారు.
కలిసొచ్చిన ఆన్లైన్ షాపింగ్..
సేల్స్ ప్రమోటర్స్, మర్చండైజర్స్, షోరూమ్ మేనేజర్లు, ఛానల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్, వేర్హౌస్ ఇన్ ఛార్జ్, టెలీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్..వంటి ఎంట్రీ లెవెల్, జూనియర్ లెవెల్ జాబ్స్కు గిరాకీ పెరిగింది. కూలింగ్ అప్లియెన్స్ల సేల్స్ టైర్ 2, 3 సిటీల్లో పెరుగుతున్నాయని డెలాయిట్ ఇండియా పార్టనర్ ఆనంద్ రామనాథన్ అన్నారు. ఆన్లైన్ షాపింగ్ విస్తరించడం కూడా సేల్స్ పెరగడానికి కారణమని చెప్పారు. సర్వీస్ జాబ్ రోల్స్కు ఫుల్ డిమాండ్ ఉందని, టెంపరరీ ఉద్యోగుల హైరింగ్ పెరిగిందని అన్నారు. ‘ఈ–కామర్స్ కంపెనీల సేల్స్లో 40 శాతం ఎలక్ట్రానిక్, కన్జూమర్ డ్యూరబుల్ ప్రొడక్టులే ఉంటున్నాయి.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఫ్లాట్ఫామ్లలో ప్రతి 10 మంది కన్జూమర్లలో ఏడుగురు టైర్ 2, 3 ప్లేస్ల నుంచే ఉన్నారు. వాల్యూ పరంగా చూస్తే, ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఖర్చు చేస్తున్న ప్రతి రూ.10 లో రూ. ఆరు మెట్రో సిటీలకు వెలుపల నుంచే వస్తున్నాయి’ అని రామనాథన్ వివరించారు. ప్రజల ఆదాయాలు పెరగడం, ఫైనాన్సింగ్ ఆప్షన్స్, లివింగ్ స్టాండర్డ్స్ మెరుగవుతుండడం కూడా చిన్న టౌన్లలో ఉద్యోగుల డిమాండ్ పెరగడానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఆర్గనైజ్డ్ రిటైల్ కంపెనీలు టైర్ 2, 3 సిటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయని, కన్జూమర్లకు వివిధ ఫైనాన్షింగ్ ఆప్షన్లను ఆఫర్ చేస్తున్నాయని బాలసుబ్రమణియన్ అన్నారు. కంపెనీలకు మరింత మంది ఉద్యోగులు అవసరమని పేర్కొన్నారు. వీటితో పాటు గ్లోబల్ కంపెనీలు తమ ఆఫీసులను టైర్ 2 సిటీలలో ఏర్పాటు చేస్తున్నాయి. ఉద్యోగుల డిమాండ్ పెరగడానికి ఇదొక కారణం.