వెస్ట్ బెంగాల్లో ఓ మారుమూల పల్లెటూళ్లో పుట్టింది షకీలా షేక్ . కానీ, తన చేతి కళతో ఇప్పుడు వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యింది.ఒకప్పుడు ఫుట్పాత్లపై తలదాచుకున్న ఈమె ఇప్పుడు పారిస్, జర్మనీ, న్యూయార్క్, నార్వేల్లో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తోంది. ఎందరికో ఇన్ఫఙరేషన్గా నిలిచిన ఈ స్ట్రీట్ వెండర్ భార్య గురించి మరిన్ని విషయాలు.
కోల్కతాకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘మొగ్రాహాట్’లో 1973లో ఆరో బిడ్డగా పుట్టింది షకీలా. ఆమె పుట్టిన కొన్నాళ్లకే కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడానికి ఆమె తండ్రి బంగ్లాదేశ్ వెళ్లాడు. కానీ, ఎన్నాళ్లు ఎదురుచూసినా తిరిగిరాలేదు. అక్కడి నుంచి డబ్బు కూడా పంపలేదు. దాంతో ఆరుగురి పిల్లల బాధ్యత షకీలా తల్లి జహీరాన్పై పడింది. కోల్కతాలో కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టింది ఆమె. షకీలా ఇంట్లో అందరికన్నా చిన్నది కావడంతో ఒంటరిగా వదల్లేక డైలీ కూరగాయల బండి దగ్గరికి తీసుకెళ్లేది తల్లి. కూరగాయాలన్నీ అమ్ముడుపోయే వరకు ఫుట్పాత్పైనే పడుకునేది షకీల.
అలా ఒక రోజు ఫుట్పాత్పై పడుకొని ఉన్న షకీలాని పెయింటర్ బల్దేవ్ రాజ్ గమనించాడు. పేద పిల్లలకి చాక్లెట్లు, ఎగ్స్, పెన్సిల్స్, మ్యాగజీన్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. వాళ్లకి చదువు కూడా చెప్తుంటాడు.
షకీలాకి కూడా చదువు చెప్పించమని ఆమె తల్లికి చెప్పాడు. ఆమె మొదట అనుమానించినా తర్వాత బల్దేవ్ మంచితనం గురించి తెలుసుకుని ఒప్పుకుంది. ఆ క్షణం నుంచి షకీలా వేసే ప్రతి అడుగులో అండగా ఉంటూ వచ్చాడు బల్దేవ్.
భరోసా లేక
బల్దేవ్ సాయంతో ఆరోతరగతి వరకు చదువుకుంది షకీలా. కానీ, ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి బాలేక తల్లి పెళ్లి పీటలెక్కించింది. అలా పన్నెండేళ్ల వయసులో తనకన్నా పదిహేనేళ్లు పెద్దవాడయిన వ్యక్తికి రెండో భార్య అయ్యింది ఆమె. భర్త కూడా స్ట్రీట్ వెండరే కావడంతో పెళ్లి తర్వాత కూడా ఆర్థికంగా ఏం మార్పురాలేదు షకీలా జీవితంలో. దాంతో కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడానికి బల్దేవ్ రాజ్ సాయంతో పేపర్ బ్యాగ్స్ తయారుచేయడం మొదలుపెట్టింది. ఆ టైంలో బల్దేవ్ రాజ్ ఆర్ట్ ఎగ్జిబిషన్కి షకీలాని తీసుకెళ్లాడు. అక్కడి రంగురంగుల పెయింటింగ్స్ షకీలాలోని ఆర్టిస్ట్ని బయటకు తీసుకొచ్చాయి.
అలా మొదలైంది
ఎగ్జిబిషన్స్లో పెయింటింగ్స్ చూశాక తనూ పెయింటింగ్ వేయాలనుకుంది ఆమె. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లతో చెప్తే మొదట నవ్వారు. అయినా అవేం పట్టించుకోకుండా భర్తతో కార్డ్బోర్డ్ షీట్, ఆయిల్ పెయింట్స్ తెప్పించుకుంది. కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ని పేపర్పై అందంగా గీసింది. అది చూసి ఇంట్లో వాళ్లు సర్ప్రైజ్ అయ్యారు. ఆమెని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మొదలైన షకీలా ఆర్ట్ జర్నీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొదటి సోలో ఎగ్జిబిషన్లోనే షకీలా వేసిన పెయింటింగ్స్ 70 వేలకు అమ్ముడయ్యాయి.
ఇంటర్నేషనల్ స్థాయికి
కూరగాయలు, పక్షులతో మొదలైన షకీలా ఆర్ట్ జర్నీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంది. డొమెస్టిక్ వయొలెన్స్పై ఈమె వేసిన పెయింటింగ్స్ చూసి ప్రపంచమంతా మెచ్చుకుంది. ప్రొఫెషనల్ పెయింటర్స్ కూడా షకీలా బొమ్మలు చూసి ప్రశంసలు కురిపించారు. కేవలం మన దేశంలోనే కాదు యూరప్, అమెరికాల్లోనూ తన పెయింటింగ్స్కి మంచి డిమాండ్ ఉంది.
షకీలా మార్క్
పెయింటర్స్ తాము గీసిన పెయింటింగ్స్కి పేర్లు పెడుతుంటారు. అందులో దాగున్న అర్థాన్ని కూడా వివరిస్తుంటారు. కానీ, షకీలా మాత్రం అవి రెండూ చేయదు. ఎందుకని అడిగితే ఆ క్వశ్చన్కి నాదగ్గర సమాధానం లేదంటుంది. షకీలా పెయింటింగ్స్కి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. 2005 లో ‘ది అకాడమీ ఆఫ్ డాన్స్’ నుంచి ‘చారుకళ’ అవార్డు అందుకుంది. ‘మ్యూజిక్ అండ్ విజువల్ ఆర్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్’ ‘లలిత కళా అకాడమీ’ల నుంచి కూడా అవార్డులు అందుకుంది షకీలా.
