ఆరు ప్రాజెక్టులకు ‘డ్రిప్’ ఫండ్స్... ప్రోగ్రామ్ ఫేజ్-2లో రూ.100 కోట్లకు ఎన్వోసీ ఇచ్చిన వరల్డ్ బ్యాంక్

ఆరు ప్రాజెక్టులకు ‘డ్రిప్’ ఫండ్స్... ప్రోగ్రామ్ ఫేజ్-2లో రూ.100 కోట్లకు ఎన్వోసీ ఇచ్చిన వరల్డ్ బ్యాంక్
  •     రాష్ట్ర వాటా రూ.75 కోట్లు మంజూరు

హైదరాబాద్, వెలుగు: డ్యామ్​ రీహాబిలిటేషన్​ అండ్​ఇంప్రూవ్​మెంట్​ ప్రోగ్రామ్(డ్రిప్) కింద తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్​ నుంచి రూ.100 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్, జూరాల, మూసీ, కౌలాస్​నాలా, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల రిపేర్లను చేపట్టనుంది. వాస్తవానికి డ్రిప్​ఫేజ్–1లో గత ప్రభుత్వం చేరలేదు. 2021లోనే ప్రతిపాదనలు వచ్చినా ముందుకెళ్లలేదు. అయితే, నిరుడు అక్టోబర్​8న కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ స్కీంలో చేరింది. 

డ్రిప్ ఫేజ్–2లో ప్రపంచ బ్యాంకు నిధులను పొందేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవానికి ప్రాజెక్టుల రిపేర్లకు రూ.545 కోట్ల మేర ఖర్చు కానుంది. ఈ మొత్తంలో రాష్ట్ర వాటా 30 శాతం, ప్రపంచ బ్యాంక్​వాటా 70 శాతంగా ఉంటుంది. 

ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంక్​ నుంచి రూ.381.5 కోట్లు రావాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్​ కోసం రూ.75 కోట్లు కేటాయించింది. అటు రావాల్సిన నిధుల్లో నుంచి రూ.100 కోట్లకు ప్రపంచ బ్యాంక్​ఓకే చెప్పింది. అయితే, వరల్డ్​ బ్యాంక్​ చేస్తున్న ఆర్థికసాయం కూడా రుణమే కావడం గమనార్హం. 6.4 శాతం వడ్డీతో డ్రిప్​ కింద ఈ రుణం ఇస్తోంది.

మూసీ పార్ట్–ఏకు వరల్డ్ బ్యాంక్​ ఓకే..

మూసీ ప్రాజెక్ట్​ పార్ట్–ఏ పనులకు ప్రపంచ బ్యాంకు నో అబ్జెక్షన్​ లెటర్ ఇచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే టెండర్లను పిలిచి పనులు చేపట్టేందుకు లైన్ క్లియర్​అయింది. కాగా, వరల్డ్​ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కలిపి రూ.175 కోట్లు ఉండగా.. శ్రీరాంసాగర్, మూసీ, జూరాల, కౌలాస్​నాలా, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల రిపేర్లకు రూ.120.90 కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రిపేర్లు చేయాల్సిన ఈ ప్రాజెక్టులను డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్(డీఎస్ఆర్​పీ) పరిశీలించింది. వాటి స్క్రీనింగ్​టెంప్లేట్స్​ను సిద్ధం చేసింది.