కొవిడ్ తో … వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అలర్ట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. కొవిడ్ దెబ్బకు చైనాలో నిన్న ఒక్కరోజే 47 మంది చనిపోయారు. దీంతో వైరస్ మృతుల సంఖ్య 2వేల 835 కు చేరింది. మరో 427 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు చైనాలో 79 వేల 251 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇటలీలో కొవిడ్ మృతుల సంఖ్య 21 చేరింది. మరో 820 మందికి వైరస్ సోకింది. దక్షిణ కొరియాలోనూ 594 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2వేల 931 కి చేరింది. ఆస్ట్రేలియాలోనూ రెండు కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 25 కు చేరింది.
యూకేలోనూ 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో కొవిడ్ ను తమ మొదటి ప్రాధన్యతగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది యూకే ప్రభుత్వం. కోవిడ్ భయంతో యూఎస్ గవర్నమెంట్ కూడా ముందస్తు చర్యలు మొదలుపెట్టింది. మార్చి 14న జరగాల్సిన ఏషియన్ సమ్మిట్ ను వాయిదా వేసుకుంది. అటు కాలిఫోర్నియాలో రెండు పాజిటివ్ కేసులను గుర్తించారు. కొవిడ్ భయంతో సౌదీ అరేబియాకు వచ్చే ప్రయాణికులకు ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. దీంతో కేరళ నుంచి సౌదీకి వెళ్లాల్సిన 10వేల మంది హజ్ యాత్రికుల బృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర హజ్ కమిటీ అంటోంది. యాత్రకు వెళ్లే సమయానికి ఆంక్షలు ఎత్తేస్తారని భరోసా ఇస్తోంది.